హెరాల్డ్ డిబేట్: శతజయంతి వేళ.. సంకుచిత రాటకు పీవీ పరిమితం!!
పాములపర్తి వేంకట నరసింహారావు. ఈ దేశ ప్రధానిగా.. అది కూడా అత్యంత దారుణమైన ఆర్థిక వ్యవస్థతో అల్లాడుతున్న సమయంలో దేశానికి దశ-దిశ చూపించిన పీవీ గురించి.. తర్వాత కాలంలో ఆర్థిక వేత్తలుగా ఎదిగినవారు.. ``ఆయన భారత్లో కాకుండా.. ఏ బ్రిటన్లోనో పుట్టి ఉంటే.. ఈ ప్రపంచం ఆయనకు పూలు పరిచి.. ప్రేమించేది!`` అని వేనోళ్ల కొనియాడారు. సాక్షాత్తూ.. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం కూ డా తాను రాసుకున్న జీవిత చరిత్ర `వింగ్స్ ఆఫ్ ఫైర్`లో `పీవీ దార్శనికతను రాసేందుకు.. పేజీలు చాల వు..`` అని పేర్కొన్నారంటే.. పీవీ స్థాయి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
``పీవీ వ్యక్తిత్వం.. పీవీ దూరదృష్టిని అంచనా వేయడం సాధ్యమా? ఆయన కర్మ యోగి! నిత్య కర్మ భోగి!!`` అంటూ.. ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి కొనియాడారంటే.. పీవీ స్థాయిని అద్దంలో చూసి సంతోషించడమే తప్ప.. చేయగలిగింది లేదు! అలాంటి నాయకుడికి, అలాంటి మేరునగధీరుడికి.. నేడు శతజయంతి జర గడం అత్యద్భుతం. ఈ ఆలోచన అత్యంత ఉత్కృష్టమే! అయితే, అదేసమయంలో.. ``సహస్రాక్ష.. సహస్త్ర పాత్``- అన్నట్టుగా.. పీవీ అనే వ్యక్తి ఈ దేశం మొత్తానికి చెందిన ఓ మౌన ముని.. మేథో గని! అయితే, ఆయ నను `మా తెలంగాణ వాడు.. మా బిడ్డ`-అని కీర్తించి.. చప్పట్లు కొట్టడంలోనే అసలు ఔచిత్యం ద్యోతకం కావ డం లేదు.
``నేను-నాది``-అనే సంస్కృతికి పీవీ వ్యతిరేకమన్న విషయాన్ని మేధావులు, రాజకీయ నేతలు ఎందుకు గ్రహించలేక పోతున్నారు. ``భారత్ వెలిగిపోతోందనేది వాస్తవం. ఆర్థిక సంస్కరణలతో ప్రగతి రథం పుంజు కుందనేది కూడా నిజమే. నేను దీనిని మనసా.. వాచా.. కర్మణా ఒప్పుకుంటాను. కానీ.. మీరంతా అన్నట్టు గా.. నా వల్లే ఇదంతా జరిగిందంటే.. మాత్రం నొచ్చుకుంటాను. ఇది అందరిదీ.. అందరి కృషీ ఉంది!``-అని ఓ సందర్భంలో పీవీనే స్వయంగా చెప్పుకొన్నారు. తాను ఒక ప్రాంతానికి.. ఒక రాష్ట్రానికి పరిమితం కావాలని పీవీ ఏనాడూ అనుకోలేదు. కానీ, నేటి శతజయంతి వేడుకలో జరిగింది ఏమిటి?
తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మా బిడ్డ.. అన్నంత వరకు బాగానే ఉంది. కానీ, ఈ ప్రాంతానికే పీవీని పరిమితం చేయడం మాత్రం పీవీ అభిమానులకు... ఆయన గురించి తెలిసిన ఈ దేశ ప్రజలకు కూడా ఏమాత్రం నచ్చలేదు. నిజానికి పీవీ పుట్టింది తెలంగాణలోనే అయినా.. ఏపీతోను, తమిళనాడు, కర్ణాటకలతోనూ ఆయనకు ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పండే గోంగూరను ఆయన ఎంతో ఇష్టపడేవారు. కృష్ణాజిల్లాలో పండే మామిడి కాయలను ప్రధానిగా ఉన్న సమయంలోనూ ఆయన ఢిల్లీకి తీసుకువెళ్లి ఇష్టంగా తినేవారు. అంతేకాదు.. ఏపీ నుంచే కందిపప్పు తీసుకువెళ్లారు. రాజకీయంగా కూడా రెండు రాష్ట్రాలతోనూ ఒకే తరహా సంబంధాలు కలుపుకొన్నారు.
అంతెందుకు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు, నాయకులు ఉన్నారంటే.. పీవీ హృద యం, ఆయన దృష్టి ఎంత దూరంగా ఉండేదో.. తెలియకనే తెలుస్తోంది. తెలుగు భాష కోసం ఆయన పరితపించారు. విజయవాడకు చెందిన.. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.. విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రిగారు రచించిన `వేయిపడగలు` నవలను పీవీ హిందీలోకి అనువదించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ సమయంలో కూడా ఆయన తన వినయాన్నే ప్రదర్శించారు తప్ప.. తాను గొప్ప అని చెప్పుకోలేదు. తాను ఈ ప్రాంతం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమని అనుకోలేదు. విశాల హృదయంలో విశ్వాన్ని నింపుకొన్న విశ్వవిజేత పీవీ. ఆయన శతజయంతి అందరిదీ... ఆయన అందరివాడు.. కొందరివాడుగా చూడడం అంటే.. పీవీని తక్కువ చేయడమే.. కొండను అద్దంలో చూపడమే!!