టాలీవుడ్ వైసీపీ హీరోలకు షాక్.. తెరవెనక ఏం జరిగింది..!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వ్యవహారాలు ఆసక్తిగా మారాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు వరుసగా ఏపీ, తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులతో పాటు పలువురు కీలక నేతలు, మంత్రులను కలుస్తున్నారు. ఈ విషయంలోనే అనేక వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ముందుగా చిరంజీవి, నాగార్జున తో పాటు ఇండస్ట్రీకి చెందిన కొందరు దర్శకులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ తో సమావేశ మయ్యారు. ఆ వెంటనే బాలయ్య ఈ మీటింగ్కు తనను పిలవలేదని... వీళ్లంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆ వెంటనే మెగా బ్రదర్ నాగబాబు బాలయ్యను విమర్శించడం.. తర్వాత ఇండస్ట్రీలో ఎక్కువ మంది బాలయ్యకు సపోర్ట్ చేయడంతో ఈ విషయం చినికి చినికి గాలి వానలా మారింది.
ఇక నిన్న ఏపీ సీఎంను కలిసేందుకు వెళ్లిన ఇండస్ట్రీ టీంలో కూడా బాలయ్య లేడు. ఇదిలా ఉంటే ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన టాలీవుడ్ ఆర్టిస్టులు పృధ్వీ, పోసాని కృష్ణమురళి, హీరో అలీ వంటి వారు నిన్న సీఎం జగన్ తో జరిగిన టాలీవుడ్ భేటీకి మాత్రం మొహం చాటేశారు. ఇక గత ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన జగన్ సమీప బంధువు అయిన సీనియర్ హీరో మోహన్బాబు కూడా ఈ విషయంలో ఎక్కడా మాట్లాడలేదు.. సరికదా.. నిన్న జగన్తో భేటీకి కూడా వెళ్లలేదు. ఇటీవల చిరు - మోహన్బాబు ఏ విషయంలో అయినా రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు.
ఇక ఇలాంటి కీలక సమావేశానికి వైసీపీ స్టార్స్ గా ఉన్న మోహన్బాబు, పృథ్వి, ఆలీ, పోసాని లాంటి వాళ్లు ఎందుకు వెళ్లలేదు... వీరు పార్టీ నుంచి తమకు ప్రయార్టీ లేదని అసంతృప్తితో ఉన్నారా ? లేదా ? పార్టీయే వీరిని లైట్ తీస్కొంటుందా ? అన్న చర్చలు నడుస్తున్నాయి. ఇక వీరికి ఆహ్వానం అందిందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే పార్టీతో సత్సంబంధాలు కలిగిన టాలీవుడ్ ఆర్టిస్టులు కీలక భేటీకి స్కిప్ కావడం చర్చనీయాంశంగా మారింది.