ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉద్యోగులు అందరూ కూడా ఒకే ఒక భయంతో బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. ఆర్థిక మాంద్యం భయాలు ఇంకా ఆదాయాలు తగ్గడం వంటి అంశాలు ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణంగా మారుతున్నాయి.తమకి కలిగిన ఆర్థిక నష్టాలను తప్పించుకోవడం కోసం ఉద్యోగుల తొలగింపునే ఏకైన మార్గంగా కంపెనీలు ఎంచుకోడమే దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు.ఈ క్రమంలో తాజాగా మరో ఐటీ టాప్ కంపెనీ అయిన డెల్ తమ ఉద్యోగులను తొలగించింది. కంప్యూటర్ల అమ్మకాలు పూర్తిగా పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,650 ఉద్యోగాలను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే తమ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. బ్లూమ్బెర్గ్ కథనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే మొత్తం సిబ్బందిలో 5 శాతం ఉద్యోగులను డెల్ కంపెనీ ఇంటికి పంపుతుందని సమాచారం తెలుస్తోంది.
ఈ తొలగింపు తర్వాత డెల్ ఉద్యోగుల సంఖ్య కనీసం 6 సంవత్సరాలలో కనిష్టంగా 1,26,300గా ఉంటుందని బ్లూమ్ బెర్గ్ నివేదికలో తెలిపింది.ఇక ఇదిలా ఉంటే ఉద్యోగుల తొలగింపుపై కంపెనీ కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం కంపెనీ మార్కెట్ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ అనిశ్చితి అనేది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఉద్యోగులను తొలగించడానికి ఇదే ప్రధాన కారణం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక కరోనా లాక్ డౌన్ తదనంతర పరిస్థితుల తర్వాత కంప్యూటర్లు ఇతర హార్డ్వేర్ ఉత్పత్తుల డిమాండ్ పెరిగి నప్పటికీ 2022 నాల్గవ త్రైమాసికంలో వ్యక్తిగత కంప్యూటర్ షిప్మెంట్లు బాగా పడిపోయాయని విశ్లేషకులు పరిశోధించి చెబుతున్నారు.ఈ విధంగా వరుసగా టాప్ కంపెనీలు తమ ఉద్యోగులని తొలగిస్తుండటం వలన చాలా మంది ఉద్యోగులు ఎప్పుడు తమ ఉద్యోగం పోతుందో అని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.