అటు కేసీఆర్‌.. ఇటు ఈడీ.. రోహిత్‌ రెడ్డి ఇరుక్కుపోయారా?

పైలట్ రోహిత్ రెడ్డి.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక వ్యక్తి. తమను బీజేపీ పెద్దలు ప్రలోభ పెట్టారంటూ ఆయనే పోలీసు కేసు పెట్టారు. ఆయన ఫామ్ హౌజ్‌లోనే కొందరు వ్యక్తులతో మంతనాలు సాగించి.. దాన్ని రికార్డు చేయించారు. అయితే.. ఇప్పుడు ఈ కేసు ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. తెలంగాణ సర్కారు ఈ కేసుపై వేసిన సిట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో రోహిత్ రెడ్డిపై ఈడీ గురి పెట్టింది.

ఆయన్ను వరుసగా విచారిస్తోంది. దీంతో ఇప్పుడు రోహిత్ రెడ్డి పరిస్థితి ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ రోహిత్‌ రెడ్డి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టును కోరారు. కోర్టులో విచారణ ముగిసే వరకు కేసు విచారణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో పైలట్ రోహిత్‌ రెడ్డి కోరారు. తనకు మనీలాండరింగ్ కేసులో నోటీసులు ఇచ్చి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివరాలను గుచ్చి గుచ్చి అడిగి వేధిస్తున్నారని పైలట్ రోహిత్‌ రెడ్డి  అన్నారు.

అసలు ఎమ్మెల్యేలకు ఎర కేసుకు మనీలాండరింగ్ తో సంబంధమే లేదని పైలట్ రోహిత్‌ రెడ్డి  అన్నారు. దర్యాప్తు అధికారి మొబైల్ ఫోన్ కు వస్తున్న వాట్సప్ మెసేజ్ ల ఆధారంగా తనను వివరాలు అడుగుతున్నారని చెప్పిన పైలట్ రోహిత్‌ రెడ్డి తాను చెప్పిన వివరాలు మాత్రం సరిగా నమోదు చేయడం లేదని అంటున్నారు. ఇటీవల బంజారాహిల్స్ లో నమోదైన ఓ కేసులో నందకుమార్ ను ఈడీ ప్రశ్నిస్తోందని పైలట్ రోహిత్‌ రెడ్డి  గుర్తు చేశారు.

నందకుమార్‌ నుంచి  తప్పుడు వాంగ్మూలాలు తీసుకొని దాని ఆధారంగా తనను ఇరికించే కుట్ర జరుగుతోందని పిటిషన్ లో పైలట్ రోహిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈడీ ఈసీఐఆర్ ను కొట్టివేయాలని.. అప్పటి వరకు కేసుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేయాలని పైలట్ రోహిత్‌ రెడ్డి  హైకోర్టును కోరారు. ఈ కేసులో కేంద్ర ఆర్థిక శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఈడీ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌ను పిటిషన్‌లో ప్రతివాదులుగా పైలట్ రోహిత్‌ రెడ్డి  చేర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: