త్వరలోనే జగన్ మరో అద్భుత కార్యక్రమం?

ఏపీ సర్కారు త్వరలో మరో అద్భుత పథకాన్ని ప్రారంభించబోతోంది. వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామంటున్న జగన్ సర్కారు ఇప్పటికే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఇక గ్రామ స్థాయిలో వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేయబోతోందని స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ తెలిపారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన నిర్వహించే గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ అవగాహన పోస్టర్ ను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ  మహమ్మారి క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించి చికిత్సతో నయం చేసేలా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ రాష్ట్రంలోనే కాకుండా దేశ అంతర్జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ క్యాన్సర్ పై చేస్తున్న పోరాటాన్ని గుర్తించి ప్రభుత్వ సహకారంతో అనుసంధానించేలా   ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొస్తామని అన్నారు. అక్టోబర్ 9 వ తేదీన నగరంలోని బిఆర్ టియస్ రోడ్ లో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

అదే రోజున ప్రపంచవ్యాప్తంగా 130 కి పైగా దేశాల్లో 450 కి పైగా ప్రదేశాల్లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారని అన్నారు.  ఈ ఫౌండేషన్ ద్వారా 2,500 మందికి పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై ఉచిత కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఐదు లక్షలకు పైగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారన్నారు. 4,350 కి పైగా క్యాన్సర్ రోగులను గుర్తించి వారికి సూచనలు సలహాలు అవసరమైన మందులను ఫౌండేషన్ ద్వారా అందించారన్నారు.

రాష్ట్రంలోనే కాక అమెరికా లోని ఏడు ప్రధాన నగరాల్లో సంస్థ కార్యకలాపాలు తెలుగువారిచే నిర్వహించబడుతున్నాయన్నారు. కోవిడ్ కష్టకాలంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ 20 లక్షల మాస్కులు, 500కి పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించి సహకరించారన్నారు. ఈ ఫౌండేషన్ ఎప్పటి వరకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారన్నారు. 2020లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ ఫౌండేషన్ సొంతం చేసుకుందని శాసనసభ స్పీకర్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: