ఆంధ్రా, తెలంగాణ రైతుల పామాయిల్ పంచాయతీ?
ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పామాయిల్ రైతులతో తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. సీతానగరంలోని పామాయిల్ ప్యాక్టరీ ఆంధ్రా రైతులకు తెలంగాణ రైతులకు పామాయిల్ ధరలో వ్యత్యాసం చూపిస్తుందని, దీని వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తుమ్మల నాగేశ్వరరావుతో చెప్పారు. తెలంగాణాలో పామాయిల్ గెలలు ధర నెలకు ముందే ప్రకటిస్తున్నారని.. ఆంధ్రాలోని సీతానగరం పామాయిల్ ప్యాక్టరీ యాజమాన్యం గెలలు దింపిన నెల రోజుల తర్వాత ధరను ప్రకటిస్తున్నారని రైతులు చెప్పారు.
ఆంధ్రా ఫ్యాక్టరీల వైఖరితో తమ ఖాతాల్లో ఎంత జమ చేస్తున్నారో తెలియడం లేదని రైతులు వాపోయారు. గెలలు ఎక్కువగా దిగుమతి అవుతున్న సీజన్ లో ధర తగ్గించి దిగుమతి తగ్గినప్పుడు ధర పెంచుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఉన్న గోద్రేజ్ ఫ్యాక్టరీ పరిధిలో 11 తెలంగాణ మండలాలు ఉన్నాయని ఆ రైతులకు తెలంగాణ ధర ఇచ్చి ఆంధ్రా రైతులకు తక్కువ ధర ఇస్తున్నారని రైతులు తుమ్మలతో తెలిపారు. తాము ఎక్కువగా వచ్చిన ప్రాంతంలో గెలలు విక్రయించుకునే ప్రయత్నం చేస్తుండగా చెక్ పోస్టులు ఏర్పాటు అడ్డుకుంటున్నారని చెప్పారు.
ఒకే ఫ్యాక్టరీలో తెలంగాణ రైతులకు ఒక ధర ఆంధ్రా రైతులకు మరో ఇవ్వడం ఏంటని దానిని పరిష్కారించాలని అధికారులు, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు అన్నారు. ఇక తాము సహించేది లేదని ఎక్కడ ఎక్కువ ధర ఇస్తే అక్కడే పామాయిల్ గెలలు విక్రయిస్తామని అడ్డుకుంటే తాము వారిపై తిరగబడతామని రైతులు అంటున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముందుగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఉన్నతాధికారులు, నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు.