కర్ణాటక: హిజాబ్ అయిపోయిందంటే ఇప్పుడు ఇంకో గోల?
ఈ మేరకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేసిన డిమాండ్కు ఈ రెండు సంఘాలు మద్ధతుగా నిలిచాయి. కర్ణాటకలో లౌడ్స్పీకర్లను ఆపకపోతే ఉదయం 5 గంటలకు మసీదుల వద్ద భజనలు చేస్తామని ఈ సంఘాలు చెబుతున్నాయి. మసీదుల వద్ద లౌడ్స్పీకర్లను తొలగించాలని రాజ్ ఠాక్రే శనివారం డిమాండ్ చేశారు. స్పీకర్లను ఆపకపోతే మసీదుల వద్ద హనుమాన్ చాలిసాను భారీగా వినిపిస్తామని ముంబయిలో జరిగిన ర్యాలీలో రాజ్ ఠాక్రే అన్నారు. మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లను ఆపాలని... సుప్రీంకోర్టు ఇచ్చిన శబ్ధ కాలుష్య ఉత్తర్వులను పాటించాలని శ్రీరామ్సేన నేతలు అంటున్నారు.
మసీదుల వద్ద లౌడ్ స్పీకర్ల అంశాన్ని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన నేతలు ఆరోపించారు. ఈ ఇష్యూ ఇప్పుడు కర్ణాటకను మరోసారి కుదిపేసేలా ఉంది. ఎందుకంటే.. ముస్లింలు రోజుకు కనీసం ఐదు సార్లు మసీదు వద్ద ప్రార్థనలు చేస్తారు.. అలా ప్రార్థన చేసినప్పుడు లౌడ్ స్పీకర్లు వాడతారు. ఆ అజా విని మిగిలిన ముస్లింలు కూడా తమ ఇళ్లలో ఆ సమయానికి ప్రార్థన చేసుకుంటారనేది ముస్లింల అభిప్రాయం.
కానీ ఇప్పుడు ముస్లింల వద్ద హనుమాన్ చాలీసా లౌడ్ స్పీకర్లతో వినిపిస్తామని అంటే.. అది పెద్ద వివాదమే అయ్యే అవకాశం ఉంది. హిజాబ్ విషయం అయినా కేవలం కొన్ని స్కూళ్లు, కళాశాలలకు పరిమితం కానీ... ఈ మసీదు ఇష్యూ ప్రతి గ్రామంలోనూ వివాదం అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి కర్ణాటకలో ఏం జరుగుతుందో?