ఏపీలో ఆ రెండు చోట్లా టీడీపీదే హవానా..!
నాయకులు మారారు.. ప్రజలు కూడా వారికి జైకొట్టారు. కానీ, ప్రయోజనం మాత్రం ప్రజలకు కనిపించడం లేదు. ఎన్నో ఆశలతో వైసీపీకి ఓట్లేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని.. కొత్తవారికి పట్టం కట్టారు. తమ సమస్యలు పట్టించుకుంటారనేది ప్రజల ఆశ. కానీ, ఏడాది తిరిగే సరికి వారికి అసలు విషయం బోధ పడిందట.. ఇప్పుడు కృష్ణాజిల్లాలో ఈ విషయమే చర్చకు వస్తోంది. రెండు కీలక నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బలంగానే ఉన్నప్పటికీ.. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. అదేసమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. ఓడిపోయినా.. ప్రజలకు అన్ని రూపాల్లోనూ అండగా ఉంటున్నారట!
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడ నుం చి పట్టుబట్టి సీటు దక్కించుకున్న మాజీ మంత్రి కొలుసు పార్థసారధి.. వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. నిజానికి కొలుసు పై ఇక్కడి ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. వివాద రహితుడుగా కూడా ముద్ర వే సుకున్నారు. దీంతో ఆయనను ఇక్కడి ప్రజలు గెలిపించుకున్నారు. అయితే తాను ఆశించిన పదవి దక్క లేదనో.. లేక.. ప్రభుత్వంలో తన పనులు సాగడం లేదనో అలక వహించిన ఆయన నియోజకవర్గంలో తిరగడమే మానేశారు. మరోపక్క, టీడీపీ నుంచి ఓడిపోయిన బోడే ప్రసాద్ మాత్రం నిత్యం ప్రజలతోనే ఉంటున్నారు. దీంతో ప్రజలంతా కూడా ఇప్పుడు తమ సమస్యలు చెప్పుకొనేందుకు బోడేనే ఆశ్రయిస్తున్నారు.
ఇక, విజయవాడ సెంట్రల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వరుసగా పోటీ చేసిన బోండా ఉ మా ఓడిపోయారు. టీడీపీలో మంచి గుర్తింపు.. మాజీ టీటీడీ సభ్యుడు కూడా అయిన బొండా ఉమా.. కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ.. ఆయన ప్రజలకు చేరువలో ఉంటున్నారు. మంచి గళం వినిపిస్తున్నారు. ఇక, ఇదే నియోజకవర్గంలో రెండో సారి విజయం(వరుసగా కాదు) సాధించిన మల్లాది విష్ణు కూడా తాను పైచేయి సాధించలేక పోతున్నాననే అనే ఆవేదనలో ఉన్నారు. దీంతో ఆయన కూడా ప్రజలకు చేరువ కాలేక పోతున్నారు. ఈ పరిణామాలతో ప్రజలు బొండా ఉమా దగ్గరకే క్యూ కడుతున్నారు.
ఈ రెండు నియోజకవర్గాల్లో మరో కీలక అంశం కూడా ఉంది. ఇక్కడ గెలిచిన నాయకులు మౌనంగా ఉండడంతోపాటు.. ప్రజలకు కూడా చేరువ కాలేక పోతుండడం ఒక మైనస్ అయితే.. వీరికి ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ నాయకులు మంచి గళం వినిపిస్తూ.. ప్రభుత్వంపై విరుచుకుపడుతుండడం వైసీపీ ఎమ్మెల్యేలకు మరో మైనస్గా మారింది. ప్రతిపక్ష నాయకులకు వీరు సరైన కౌంటర్ ఇవ్వలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది పూర్తి అయినా.. ఇప్పటికీ ప్రజలకు చేరువ కాలేక పోవడం, ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేయలేక పోవడం గమనార్హం.