టీడీపీ ఆక్రోశం: ఏపీ సీఎస్.. ఈసీకీ గంతలు కట్టేస్తున్నారా?
కొత్త జాబితాలో సగానికి పైగా వైసీపీ మనుషులే ఉన్నారని ఆరోపిస్తున్నాయి. వైఎస్కు అనుకూలుడైన సీఎస్ జవహర్రెడ్డి.. వైసీపీకి అనుకూలులైన వారిని ఏరి కోరి మరీ కొత్తగా నియమించారని గగ్గోలు పెడుతున్నాయి. కొత్త వారిని నియమించాలని సీఈసీ ఆదేశించినా ముగ్గురి ప్యానెల్తో జాబితా పంపాల్సింది సీఎస్ జవహర్రెడ్డే. దాన్నే అవకాశంగా మార్చుకున్న సీఎస్ సీఎస్ జవహర్రెడ్డి.. వైసీపీకి ఊడిగం చేసే అధికారులనే మళ్లీ ప్రతిపాదించారని వాదిస్తున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా బదిలీ వేటు వేసిన ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమించే క్రమంలో సీఎస్ జవహర్ రెడ్డి తన ఏకపక్ష ధోరణిని, ఎన్నికల్లో వైసీపీకి మేలు చేయాలన్న తపనను బయటపెట్టారని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అంటున్నాయి. జవహర్రెడ్డి తన చాతుర్యాన్ని, అధికారపార్టీపై అంతులేని విధేయతను ప్రదర్శిస్తున్నారని... ఈసీ కళ్లకే గంతలు కడుతున్నారని ఆరోపిస్తూ కథనాలు రాసేస్తున్నాయి.
ఐపీఎస్ ఆర్.గంగాధర్రావు అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు చంద్రబాబు అంగళ్లులో పర్యటించిన సందర్భంలో వైసీపీ నాయకులు ఆయనపై దాడులు చేసి, రాళ్లు విసిరితే వాళ్లను వదిలేశారని అంటున్నాయి. బాధితుడైన చంద్రబాబుపైనే ఏకంగా హత్యయత్నం కేసు పెట్టడంలో గంగాధర్రావు పాత్ర కీలకమని ఆరోపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ తో పాటు కొత్తగా వచ్చిన వారంతా వైసీపీకి పని చేసేవారే అని ఎల్లో మీడియా రాసేస్తోంది. చిత్తూరు జిల్లా ఎస్పీగా వచ్చిన కె.ఎస్.ఎస్.వి.సుబ్బారెడ్డిపై కూడా వైసీపీ అనుకూలమనే ముద్ర ఉందంటున్నాయి.