జగన్‌ సిద్ధం క్రేజ్.. దేనికి సంకేతం?

Chakravarthi Kalyan
ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగమే నడుస్తోంది. అందుకు అనుగుణంగా రాజకీయ నాయకులు కూడా తమ శైలిని మార్చుకుంటున్నారు. గతంలో పేపర్లో వార్తలు రావాలని.. తమ ఫొటో వస్తే చాలు అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఎవరికి వారు సొంతంగా సోషల్ మీడియాలో ఒక ఛానల్ ను సృష్టించి వారికి సంబంధించిన కార్యక్రమాలు తదితర వాటిని పోస్టు చేస్తున్నారు. తద్వారా వారికి వారే ప్రచారం కల్పించుకుంటున్నారు.

తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభ నిర్వహించారు. ఈ సభకు లక్షలాది మంది జనం వచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇదే కాక సోషల్ మీడియాలో సైతం సిద్ధం సభ సంచలనం సృష్టించింది. ఇది సామాజిక మాధ్యమాలను ఊపేసినట్లు తాజా గణాంకాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. వైఎస్ జగన్ ఎగైన్, వై నాట్ 175, సిద్ధం హ్యాష్ ట్యాగ్ లు, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి.  ట్రెండింగ్ లో నిలిచాయి.

ఫేస్ బుక్, ఇన్ స్టాంగ్రాం వంటి ఇతర సోషల్ మీడియా సైట్లలో సైతం సిద్ధం సభ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అభిమానులు భారీగా పోస్టులు చేశారు. సాధారణంగా నెటిజన్లు ఎక్కువగా ఎక్స్ లో పోస్టులు చేయడం, వాటిపై స్పందించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యక్ష ప్రసారాలకు తక్కువగా చూస్తారు. కానీ సీఎం జగన్ ప్రసంగాన్ని ఎక్స్ లో 11 వేల మంది వీక్షించారు. ఇక గతంలో యోగీ ఆదిత్య నాథ్ నిర్వహించిన సభను 2400మంది వీక్షించారు.

మరో సామాజిక మాధ్యమం యూట్యూబ్ లో సాక్షి ఛాన్ల్ ను 56 వేల మంది లైవ్లో చూడగా.. ఎన్ టీవీ, టీవీ 9 లాంటి ఛానళ్లలో భారీ ఎత్తున సిద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. ఇటు సోషల్ మీడియాలో.. అటు వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది సిద్ధం సభను తిలకించారు. ప్రజల్లో జగన్ కు ఉన్న క్రేజ్ ని ఈ సభలు మరోసారి నిరూపించాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: