ఆ రెబెల్స్‌కు జగన్ గుణపాఠం చెబుతారా?

Chakravarthi Kalyan
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముంగిట అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అవుతున్న మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని టీడీపీ, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఎన్నికల ముందు అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది.  ఈ నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది.

ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్  పార్టీలు మారిన 9మంది ఎమ్మెల్యేలకు ఎందుకు అనర్హత వేటు వేయకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి తమ వివరణ ఇచ్చారు. అయితే విచారణకు తక్కువ సమయం ఇచ్చారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుంది.

తాజాగా ఈ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లకు శాసన సభ అధికారులు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 8న ఉదయం 11గంటలకు స్వయంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు స్పీకర్ కార్యాలయం ఫిబ్రవరి 5లోపు నోటీసులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.

అయితే అనర్హత వ్యవహారంలో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. జనవరి 29న ఒకసారి విచారించారు. ఇప్పుడు మళ్లీ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడిన పేపర్ క్లిప్పింగులను, ఆధారాలను చూపుతారు.  వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టే మీపై అనర్హత వేటు వేసేందుకు వాళ్లు నోటీసులు ఇచ్చారు. దీనిపై మీ సంజాయిషీ ఏంటి అని అడుగుతారు. ఇలా నోటీసులు ఇచ్చి సాగదీసుకుంటూ రాజ్యసభ ఎన్నికల ముందు సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై రెబెల్ ఎమ్మెల్యేలు కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఓటు వేసేందుకు పావులు కదిపే అవకాశం లేకపోలేదు.  కానీ చూద్దాం ఏం జరుగుతుందో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: