జగనన్న కానుకలో భారీ స్కామ్‌ ఉందా?

Chakravarthi Kalyan
ఏపీలో కుంభకోణాల రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్ ప్రభుత్వం జైలుకి పంపడంతో ఆ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు అరెస్టును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఖండించారు. అయితే జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెడతామని జనసేన ప్రకటించింది. అందులో భాగంగా ఇటీవల జగనన్న విద్యా కానుకలో భారీ కుంభకోణం జరిగిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.


ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే జగనన్న కానుకలో రూ.120 కోట్లు దారి మళ్లాయని ఇటీవల ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అయిదు కంపెనీలపై దాడులు చేసిందన్నారు. దిల్లీలో తీగ లాగితే ఏపీలో డొంక కదిలిందని పేర్కొన్నారు. నిధులు ఎలా దారి మళ్లాయనే దానిపై ఈడీ సమగ్ర విచారణ చేపట్టిందని..  5 కంపెనీలు సిండికేట్ గా మారాయనేది అర్థం అవుతుందన్నారు. ఉత్తరాంధ్ర వయా తాడేపల్లి మీదుగా రాయలసీమకు ఇవి చేరాయా అని ప్రశ్నించారు. విద్యార్థులకు నాసిరకం బూట్లు, స్కూల్ బ్యాగులు పంపిణీ చేస్తున్నారన్నారు.


కమీషన్ల కోసమే ప్రభుత్వ పెద్దలు లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఇప్పటి వరకు విద్యా కానుక పేరుతో ప్రభుత్వం రూ.2400 కోట్లు నిధులు వెచ్చించిదంని గుర్తు చేశారు. ఈ అయిదు కంపెనీల వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 35లక్షల మంది  విద్యార్థులు ఉంటే 42లక్షల పర్చేస్ ఆర్డర్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.


అయితే మొదటి నుంచి జగనన్న విద్యా దీవెనపై జనసేన విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఈ క్రమంలో దిల్లీలో ఈడీ జరిపిన దాడుల్లో ఏపీకి విద్యా కానుక సరఫరా చేసిన కంపెనీల వివరాలు ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేళ ఇది నిజం అయితే జగన్ సర్కారు అవినీతి ఊబిలో చిక్కుకున్నట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: