2029: దేశ రాజకీయాల్లో పెనుమార్పులు?

Chakravarthi Kalyan
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును తీసుకురానుందని.. విపక్ష పార్టీలు ఆరోపించాయి. కానీ కేంద్రం ప్రతిపక్షాలకు ఊహించని ఝులక్ ఇస్తూ మహిళా బిల్లును తీసుకు వచ్చారు. అయితే జమిలి పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఎన్నికలపై తమ కసరత్తును ప్రారంభించింది.  అయితే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న జమిలి ఉంటుందా ఉండదా అని.

లా కమిషన్ మాత్రం 2029లో అసెంబ్లీ, పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ ప్రయత్నాలు చేస్తోంది. 2024లో మోదీ సర్కారు మరోసారి కొలువు తీరితేనే ఇది సాధ్యమవుతుంది. రాకపోతే అవకాశం చాలా తక్కువ. రాజ్యాంగ సవరణ ద్వారా వివిధ రాష్ట్రాల కాల వ్యవధిని పొడిగించడం.. లేదా కుదించడం వంటివి చేపట్టనున్నట్లు సమాచారం. దీనికి మెజార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలి.

ఉదాహరణకు 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా మళ్లీ రెండేళ్లకే 2029లో అందరికీ కలిసి మరోసారి  జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలి. కేంద్రంలో మరోసార నరేంద్రమోదీ అధికారం చేపడితే ఇది సాధ్యమవుతుంది. ఓటరు జాబితా కూడా ఒకేసారి రూపొందించాలి అని లా కమిషన్ ప్రతిపాదిస్తోంది. లోక్ సభ  ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం, అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం  ఓటరు జాబితాను తయారు  చేస్తున్నాయి. రెండింటి ప్రక్రియ ఒక్కటే అయినా రెండుసార్లు చేయాల్సి వస్తోంది.

జమిలి ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించాలని లా కమిషన్ యోచిస్తోంది. తొలి విడతలో అసెంబ్లీ లు, లోక్ సభ కు.. రెండో విడతలో స్థానిక సంస్థలకు దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తోంది.  భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆచరణ యోగ్యమైన విధానం అని కమిషన్ భావిస్తోంది.  చూద్దాం ఏం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: