
అతనేమో నలుపు.. కానీ కుమారుడు ఎర్రగా ఉన్నాడని?
భార్య శీలాన్ని శంకించిన భర్త.. కట్టుకున్న భార్యనే కడతేల్చాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని అచ్చికాడు గ్రామానికి చెందిన అయ్యప్పన్ అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన గ్రామానికి చెందిన అఖిల అనే యువతిని 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఇప్పుడు ఒకరి వయస్సు 9 సంవత్సరాలు కాగా.. మరొకటి వయస్సు 7 సంవత్సరాలు. అయితే వీరిలో ఒకరు నల్లగా, మరొకరు ఎర్రగా పుట్టడంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. అనుమానం మరింత పెరగడంతో భార్యను రోజూ ప్రశ్నిస్తూ ఉండేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో క్షణికావేశంలో భార్యను గొంతు నులిమి భర్త హత్య చేశాడు.
ఈ కేసులో అయ్యప్పన్పై గతంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా.. గత కొంతకాలంగా దీనిపై విచారణ జరుగుతోంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. అయ్యప్పన్ను దోషిగా నిర్ధారించి తాజాగా శిక్ష విధించింది. అయ్యప్పన్కు జీవిత కారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే మైలాడురురైలో జిల్లా ప్రిన్సిపాల్ సెషన్స్ కోర్టు ఏర్పాటు అయిన తర్వాత హత్య కేసులో దోషికి జీవిత ఖైదు విధించడం ఇది తొలిసారి అని చెబుతున్నారు.