పెళ్లయిన రెండోరోజే.. ఇలా జరుగుతుందని ఎవరనుకుంటారు?
దైవ దర్శనానికి వెళ్లే క్రమంలో అందరినీ తెల్లవారుజామునే నిద్ర లేపాడు సదరు యువకుడు. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం లో వెలుగులోకి వచ్చింది. పుణ్య పురం గ్రామానికి చెందిన కంభంపాటి నరేష్ అనే 29 ఏళ్ల యువకుడు ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఆర్ల పాడు కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అదేరోజు వరుడి స్వగ్రామంలో రిసెప్షన్ ఏర్పాటు చేయగా ఆ వేడుకలో కూడా నరేష్ ఎంతో సంతోషంగా గడిపాడు.
ఈ క్రమంలో నూతన వధూవరులు ఇద్దరినీ కూడా సమీపంలో ఉన్న ఒక దేవాలయానికి దైవదర్శనానికి తీసుకువెళ్లాలి అని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచి బంధువులు అందరికీ కూడా వెంటనే రెడీ కావాలి అంటూ నిద్రలేపాడు నరేష్. స్నానం చేసి వస్తాను అంటూ గదిలోకి వెళ్ళాడు. బంధువులందరూ ప్రయాణ ఏర్పాట్లలో మునిగిపోయారు. కానీ అంతలో నరేష్ గదిలోకి వెళ్లి చూడగా ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు నరేష్. బ్లేడుతో మణికట్టు తోపాటు గొంతు కూడా కోసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.