ఆర్టీసీ బస్సులో అరుదైన తాబేళ్లు.. ఎక్కడంటే..?
తాజాగా నెల్లూరు జిల్లాలో అరుదైన నక్షత్ర తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తడ మండలం బీవీపాలెం వద్ద ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ ఆర్యూవీఎస్ ప్రసాద్ చేపట్టిన వాహనాల తనిఖీలలో భాగంగా 134 నక్షత్ర తాబేళ్లు పట్టుబడ్డాయి. తమిళనాడు పురుషవాకానికి చెందిన రవికుమార్ నెల్లూరు నుంచి చెన్నైకి అక్రమంగాతమిళనాడు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నాడు. ఈ అరుదైన నక్షత్ర తాబేళ్లతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వీటి విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. వీటిని చెన్నై నుంచి మలేషియాకు తరలించి 8 నుంచి పది లక్షల రూపాయల మధ్య అమ్మకాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. పట్టుబడ్డ అరుదైన నక్షత్ర తాబేళ్లను నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరామారావు ఆధ్వర్యంలో జిల్లా అటవీశాఖ అధికారులకు అందించి వాటిని సంరక్షణ కల్పించాలని సూచించారు.
మరొకవైపు తడ మండలం బీవీపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. గంజాయితో పాటు ఎర్రచందనం, ఇసుక మాఫియా వంటి ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బీవీ పాలెం వద్ద అక్రమ రవాణాకు స్వస్తి పలికే విధంగా జిల్లా ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. ముఖ్యంగా ఈ తాబేళ్లు భారతదేశంలో ఒడిశా, తమిళనాడు, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలలో అధికంగా లభ్యమవుతూ ఉంటాయి.