బాబోయ్.. ఆంటీలు కుర్రాళ్లను ఇలా కూడా మోసం చేస్తారా..?

Chakravarthi Kalyan
మోసం.. మోసం.. మోసం.. ఇప్పుడు మోసగాళ్లదే రాజ్యం. అంతే కాదు.. స్మార్ట్ ఫోన్ యుగంలో మోసం చేయడం కూడా ఓ కళగా మారిపోయింది. కాస్త తెలివితేటలు.. లోకజ్ఞానం.. ఎదుటి వ్యక్తిని బోల్తా కొట్టించే తెలివి తేటలు ఉంటే చాలు.. కేవలం స్మార్ట్ ఫోన్‌ తోనే లక్షలకు లక్షలు మోసం చేస్తున్నారు చాలా మంది. ఇవన్నీ సైబర్ నేరాలు.. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న కథ ఓ వంట మనిషి చేసిన మోసం.. అమ్మాయితో మాట్లాడితే చాలు అనుకునే మగాళ్లను ఎలా సులువుగా మోసం చేయొచ్చే చెప్పిన ఓ వంట మనిషి కథ ఇది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ వంట మనిషి.. ఓ శుభాకార్యంలో ఓ కుర్రాడి నెంబర్ దొరికింది. అంతే.. కుర్రాళ్లను ఈజీగా బుట్టలో పడేయొచ్చని మాటలు కలిపింది. పరిచయం పెంచుకుంది. తన పేరు మార్చి చాటింగ్‌ చేయడం ప్రారంభించింది. అమ్మాయే కదా అని సదరు యువకుడు కూడా ఆశపడ్డాడు. ఆ యువతి తనకు తాను హైదరాబాద్‌కు చెందిన నందుగా పరిచయం చేసుకుంది. వేరే అమ్మాయి టిక్‌టాక్‌లు,  ఫొటోలు అప్‌లోడ్‌ చేసి తనవేనని పంపించింది. మూడు నెలల తర్వాత తనే.. గొంతుమార్చి తన పేరు వైశు అని, తాను నందు స్నేహితురాలినని పరిచయం చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి జగిత్యాల వెళ్తుండగా నందు రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిందని నమ్మించింది.

అక్కడే ఉంది అసలు ట్విస్టు.. నందు మొబైల్‌ ఫోన్‌లో మీ ఇద్దరి ఫొటోలు ఉన్నాయని, తనకు కొంత డబ్బు ఇస్తే ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పనని బెదిరించింది. ఎందుకొచ్చిన గొడవ అని సదరు యువకుడు కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు తన పేరు సునీత అని మళ్లీ పేరు మార్చుకుని ఆ కుర్రాడికి ఫోన్‌ చేసింది. నందు, వైశు ఇద్దరూ మృతిచెందారని.. వారి చావులకు నీవే కారణమని మరోసారి బెదిరించింది. డబ్బు ఇవ్వకపోతే.. పోలీస్ కేసు పెడతానని బెదిరించింది.  మళ్లీ డబ్బు డిమాండ్ చేసింది. డబ్బులు పంపకుంటే ఇద్దరి మృతికి నువ్వే కారణమని చెబుతానని బెదిరించింది.

మళ్లీ భయపడిపోయిన సదరు కుర్రాడు మళ్లీ డబ్బు పంపాడు.. ఇలా మొత్తం రూ.15లక్షల వరకు ఆ అమ్మాయి ఆ అబ్బాయి నుంచి పిండి పిండి వదిలేసింది. పాపం.. దుబాయి నుంచి వచ్చిన ఆ కుర్రాడు  తనకొచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి పోలీసులు ఆ మాయలాడిని పట్టుకున్నారు. ఆమె నుంచి కొంత సొమ్ము, బంగారం స్వాధీనం చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: