కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్!
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... బోయిన్ పల్లిలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మాజీ హాకీ ప్లేయర్ ప్రవీణ్ రావు మరియు అతని సోదరులు కిడ్నాప్కు గురయ్యారు. ఐటీ అధికారుల పేరుతో సోదాలు, అరెస్ట్ ల పేరుతో కిడ్నాపర్లు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్నవారిని ఓ గదిలో బంధించారు. ఈ ముగ్గుర్ని కూడా కారుల్లో ఎక్కించి తీసుకెళ్లారు. అయితే ఫిర్యాదు అందిన ఆరుగంటల్లోనే నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నేరుగా రంగంలోకి హైదరాబాద్ సిపి అంజనీకుమార్ దిగారు. నగర శివార్లు దాటకముందే కిడ్నాపర్స్ ఎవరో గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 15మంది నిందితులు ఉన్నారు. కిడ్నాపర్లు ఉపయోగించిన మూడు వాహనాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తీసుకెళ్లిన ఫోన్స్, హార్డిస్క్, డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. హఫీజ్ పేట్ 50 ఎకరాల భూ వివాదమే ఈ కిడ్నాప్ కి కారణం అని పోలీసులు తేల్చారు. అయితే ఈ భూ వివాదంలో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ సోదరుడు చంద్రబోస్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు . ఈ క్రమంలోనే పోలీసులు మాజీ మంత్రి అఖిలప్రియను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.