ఇప్పటి బైక్‌లకి హెడ్‌లైట్స్.. ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయ్.. దీనికి కారణమేంటో తెలుసా?

praveen

కొత్త మార్కెట్లోకి వస్తున్న బైక్‌లు స్టార్ట్ చేయగానే హెడ్‌లైట్లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ఇవి వెలుగుతూనే ఉంటే బ్యాటరీ త్వరగా అయిపోతుందని చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. కానీ బైక్ లైట్లు ఎప్పుడూ వెలుగుతూ ఉంటేనే రైడర్లు సురక్షితంగా ఉండగలరు. రైడర్లకు మంచి చేయాలని ఉద్దేశంతోనే కంపెనీలు ఎల్లప్పుడూ హెడ్ లైట్స్ వెలిగేలాగా వాటిని తయారు చేస్తున్నాయి.
2017, ఏప్రిల్ 1 నుంచి బైక్‌లలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. అప్పటి నుంచి కొత్తగా వచ్చే బైక్‌లలో హెడ్‌లైట్‌లను ఆఫ్ చేయలేరు. అంటే, బైక్ స్టార్ట్ చేయగానే హెడ్‌లైట్లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. ఎందుకు ఈ మార్పు? ద్విచక్ర వాహనాల వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హెడ్‌లైట్లు ఆన్‌లో ఉన్నప్పుడు, ఇతర వాహనదారులు దూరం నుంచే బైక్‌ను గమనించగలరు. దీని వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. బైక్ స్టార్ట్ చేసిన తర్వాత, హెడ్‌లైట్లను హై బీమ్ లేదా లో బీమ్‌కు మార్చవచ్చు. ఈ మార్పు రోడ్డు సేఫ్టీకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి, దీన్ని అందరూ పాటించాలి.
కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. బైక్‌లలో ఆటోమేటిక్‌గా హెడ్‌లైట్లు ఆన్ అయ్యేలా చేయాలని కంపెనీలకు ఒక ఆదేశం జారీ చేసింది. అప్పటినుంచి ద్విచక్ర వాహనాలు తయారు చేసే కంపెనీలన్నీ ఈ రూల్ పాటిస్తున్నాయి.  బైక్ స్టార్ట్ చేసిన వెంటనే, హెడ్‌లైట్లు ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. డే టైంలో లేదంటే ఎప్పుడు బైక్ నడిపినా, హెడ్‌లైట్లు ఆన్‌లోనే ఉంటాయి.
ఈ నిబంధన వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, రాత్రి వేళల్లో బైక్‌లను గమనించడం చాలా సులభతరం అయ్యింది. కొన్ని దేశాల్లో ఈ నిబంధన చాలా కాలంగా అమలులో ఉంది. భారతదేశంలో ఇలాంటి నిబంధనలు రావడం చాలా అవసరం అని రోడ్డు భద్రతా నిపుణులు అంటున్నారు. ఇకపోతే ఇండియాలో ట్రాఫిక్ పాటించేవారు చాలా తక్కువ మంది అని చెప్పుకోవచ్చు. వీరిని కూడా క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: