ప్రైవేట్ లో లాభాలు.. ప్రభుత్వ సంస్థలలో నష్టాలు ఎందుకు..!

Chandrasekhar Reddy
ప్రభుత్వ రంగ సంస్థలలో అదే నిర్వహణ యంత్రాంగం, ప్రైవేట్ రంగ సంస్థలలో కూడా అదే తరహా వ్యవస్థ అయినప్పటికీ ఒకదానిలో తీరని నష్టాలు, మరోదానిలో ఎనలేని లాభాలు ఎలా సాధ్యం. ఈ చిన్న విషయం పట్ల ఎందుకు చర్చలు జరిపారు. ఆయా విషయాలపట్ల ఎందుకు చర్యలు తీసుకోరు. అలాంటివి చేయకుండా ఎంతసేపు ప్రైవేట్ పరం చేసేద్దాం అని చెప్పుకుంటే ప్రభుత్వంపై మరియు ప్రభుత్వ సంస్థలపై ఉన్న నమ్మకం ప్రజలలో సన్నగిల్లుతోందా లేదా. ఆ మాత్రం తెలియకుండా ఈ రాజకీయ పార్టీలు లేవనేది అందరికి తెలుసు. కానీ ఎవరి జేబులోకి రావాల్సింది వాళ్లకు రావాలనేది వాళ్ళ దురాశ. ఇది అసలు సమస్య, అందుకే ఆ నష్టాలు. ముందు వ్యవస్థలో లోపాలు సరిచేయడం ఎవరి వలనా కావడం లేదు, దానిని ఒప్పుకోలేక మరో దారి వెతుక్కుంటూ పోతున్నారు.
ప్రతిదానిలో అవినీతి, దీనితో నిర్వహణ లోపాలు, నాణ్యత లేని వనరులు, నిర్లక్ష్య ధోరణి ఇవన్నీ ఉన్న చోట లాభాలు ఎలా వస్తాయని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రారంభిస్తున్నారు. అవన్నీ లేని ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కదానిపేరు చెప్పండి చూద్దాం! అవన్నీ కుదరని పని. కేవలం వాళ్ళ స్వార్థం కోసం కొన్నాళ్ళు ప్రభుత్వం నిలవాలి కాబట్టి, పెట్టుబడులు అంటూ నాటకాలు ఆడతారు. తమ జేబులు నిండాక, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయి, అందుకే ప్రైవేట్ పరం చేస్తున్నాం అంటున్నారు. నిర్వహణ లోపాలు పెట్టుకొని, నష్టాలు వస్తున్నాయంటే ఎలాగండి, ముందు ఆ లోపాలు సరిదిద్దండి. అవన్నీ దిద్దటం సాధ్యం కాకనే, ప్రైవేట్ పరం చేస్తున్నాం అండి అంటారా.. అప్పుడైతే మీరు ఒక సంస్థలోని లోపలనే సరిచేయలేని వారు, దేశాన్ని ఎలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలరు.
ఇవన్నీ ఆలోచించకుండా ఎంతసేపు నష్టాలు వస్తున్నాయని సాకు చూపిస్తే ఎలాగూ. ఇక ప్రైవేట్ సంస్థలను కూడా ప్రభుత్వాలు వదిలిపెడుతున్నాయా, ఒకడు సంస్థ ఏర్పాటు చేస్తామని వస్తే, నా వాటా ఎంత అని పెట్టుబడిలో సగం లాగకుండా ఏ సంస్థ అయినా భారతదేశంలో ఏర్పాటు చేయబడిందా! ఇలా ఎక్కడి కక్కడ జలగలలాగా పీడిస్తూ, నష్టాలు చూపిస్తున్నది ఎవడు, వాడిని వ్యవస్థ నుండి తీసేయండి. అప్పుడు ప్రైవేట్-ప్రభుత్వ రంగాలు సుస్పష్టమైన లాభాలతో దేశాన్ని అభివృద్ధిపదం వైపు తీసుకెళ్లగలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: