ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రేపు కోర్టులో సంచలనం సృష్టిస్తారా.. అంటే అవునంటున్నారు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్. రేపు అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో ఢిల్లీ మద్యం కేసులో నగదు ఎక్కడుందనే వివరాలు ఆధారాలతో వెల్లడిస్తారని ఆమె ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. కేజ్రీవాల్ కోర్టులో ఏం చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో మాత్రం ఊరట దక్కలేదు.
మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. కేజ్రీవాల్ను అరెస్టు చేయడంపై జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు విచారించింది. మద్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న కేజ్రీవాల్ విజ్ఞప్తిపై ఈనెల 2 లోపు వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.