తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా న్యూఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి తాజాగా సారించారు. న్యూఢిల్లీ లోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అసలు భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఅడిగి తెలుసుకున్నారు.
ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని వారు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.