ముఖ్యమంత్రి జగన్కి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇడుపులపాయ నేలమాళిగల్లో గట్టలుగుట్టలుగా ఉన్న రూ.2 వేల నోట్లుతో వచ్చే ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న జగన్.. ఆర్బీఐ నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆ పార్టీ నేత కాలవ శ్రీనివాసులు అంటున్నారు. రద్దు చేయనున్న నోట్లు మార్చుకోడానికి సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే పెద్ద మొత్తాల్లో బ్యాంకుల్లో జమ అయ్యే రూ.2 వేల నోట్ల వెనుక ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టి వారి వివరాలు బయట పెట్టాలని ఆర్బీఐకి కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.
పెద్ద నోట్ల రద్దుతో అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చంద్రబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారని కాలవ శ్రీనివాసులు గుర్తు చేశారు. రాజకీయాల్లో, వ్యాపారాల్లో అక్రమార్జన చేసిన వారు పెద్ద నోట్లు ఎక్కువగా దాచుకునే అవకాశాలున్నాయన్న కాలవ శ్రీనివాసులు.. పన్ను ఎగవేతదారులకు, నల్లధనం దాచుకునే వారికి పెద్ద నోట్ల వ్యవహారం పెద్ద అవకాశంగా ఉంటుందన్నారు.