రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎల్లుండి అన్ని నియోజక వర్గ కేంద్రాలల్లో నిరసన దీక్షలు ఉంటాయని పీసీసీ నేతలు స్పష్టం చేశారు. భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, హిడెన్ బర్గ్ నివేదిక, ఆదానీ మోదీల కుంభకోణం బయటకు వచ్చిందని పీసీసీ నేతలు ఆరోపించారు.
న్యాయస్థానం తీర్పు వచ్చి 24 గంటలు గడవక ముందే రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని పీసీసీ నేతలు తప్పుబట్టారు. రేపు అన్ని జిల్లా కేంద్రాలల్లో గాంధీవిగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు ఉంటాయని పీసీసీ నేతలు వెల్లడించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా చేపడుతున్నపోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని పీసీసీ నేతలు పిలుపునిచ్చారు.