ఇద్దరు అమ్మాయిలు.. ఒక్క వ్యక్తినే పెళ్లి చేసుకున్న విచిత్ర సంఘటన.. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో జరిగింది. అంతే కాదు.. ఆ ఇద్దరు వధువులు కవలలు కావడం విశేషం. షోలాపూర్ జిల్లాలో పింకీ, రింకీ యువతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కవలలైన వధువులు ఇద్దరి వయసు 36 ఏళ్లు. కొన్ని రోజుల క్రితం తండ్రి మృతి చెందాడు. వారిద్దరూ అమ్మతో కలిసి జీవిస్తున్నారు. ఇక పెళ్లి కొడుకు అతుల్ ఓ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. పింకీ, రింకీల తల్లి ఇటీవల అనారోగ్యం పాలైంది. ఆమెను వారు అతుల్ కారులో ఆస్పత్రికి తరలించారు. అప్పుడే వారికి అతడితో పరిచయం ఏర్పడింది.
అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ అతడినే పెళ్లాడేందుకు సిద్ధపడ్డారు. ఈ విచిత్రమైన పెళ్లికి పింకీ, రింకీతో పాటు అతుల్ కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు. ఆనందంగా పెళ్లి పీటలెక్కిన వరుడు అక్కాచెల్లెళ్లను వివాహమాడాడు. వధువులిద్దరూ వరుడికి ఆనందంగా పెళ్లి దండ వేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే... పెళ్లిపై పోలీసులు కేసు పెట్టారు. IPC సెక్షన్ 494 కింద పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.