భారత దేశంలో అక్టోబర్ నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విషయాన్ని టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. అల్ట్రా-హై స్పీడ్ డేటా సేవలందించే 5g స్పెక్ట్రం వేలం కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ సంస్థలు తొలిరోజే బిడ్లు దాఖలు చేశాయి. ఇవి లక్షా 45వేల కోట్లు విలువైన బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో రిలయన్స్ జియో అత్యధికంగా 80వేల 100 కోట్లు విలువైన స్పెక్ట్రమ్ కోసం బిడ్ దాఖలు చేసింది. ఎయిర్టెల్ 45 వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా 18వేల 400 కోట్లు, అదానీ 900 కోట్లు విలువైన బిడ్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
మొత్తం మీద 5-జీ వేలం రెండోరోజు 9వ రౌండ్ పూర్తయ్యేసరికి లక్షా 49 వేల 454 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలైనట్టు తెలుస్తోంది. అన్ని బ్యాండ్లలోనూ ఆపరేటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. వేలం కొనసాగుతుందన్న టెలికాం మంత్రి వేలం ప్రక్రియ పూర్తయిన వెంటనే స్పెక్ట్రమ్ కేటాయింపులు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో టెలికాం పరిశ్రమ మరింత విస్తరించబోతోందన్న మంత్రి పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.