వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం పోతే ఏమవుతుందో ప్రజలకు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన మూడేళ్ల తరువాత మీ ముందుకు వచ్చాను... పథకాల అందుతున్నాయా లేదా అన్నవి తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాననంటూ ప్రజలను పలకరించారు. పథకాల అమలుకు సంబంధించి మీరు ఎవ్వరికైనా లంచం ఇచ్చారా .. లేదా అని ప్రశ్నించారు. మీరు ఫలానా పార్టీకి ఓటు వేయాలని కండీషన్ పెట్టారా అన్నవి కూడా మిమ్మల్ని ప్రశ్నించానని ధర్మాన చెప్పారు. అయితే.. నిష్పక్షపాతంగా పథకాలు అందుతున్నాయన్నది నిర్వివాదాంశమని.. అందుకే ఈ ప్రభుత్వం ప్రజలకు చేరువ అయ్యేందుకు పథకాల అమలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు.
ఒకవేళ ఈ ప్రభుత్వం పోతే ఏమౌతుంది.. అనే దాని గురించి ఆలోచించాలి. మీరు ఓటేసి ఎంచుకున్న ప్రభుత్వం బట్టే ఇవన్నీ ఆధారపడి ఉంటాయని.. జగన్ ప్రభుత్వం పోతే.. ఇలాంటి పథకాలు మళ్లీ మీకు అందవని అన్నారు.