ఏటీఎం మెషీన్లలో దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. ఏటీఎం మెషీన్ వచ్చిన కొత్తలో వాటి వద్ద తప్పనిసరిగా ఓ సెక్యూరిటీ గార్డు ఉండే వాడు.. కానీ ఇప్పుడు అలా ఏం ఉండటం లేదు. అందులో ఓ సీసీ కేమేరా పెట్టేసి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నాయి. దీనికితోడు జనం కూడా డిజిటల్ లావాదేవీలు బాగా పెంచేశారు. అందుకే.. పెద్దగా జనం లేని ఏటీఎంలను కొందరు దొంగలు ఎంచుకుంటున్నారు. అయితే ఏటీఎంను చోరీ చేయడం అంత సులభం కాదు. ఏటీఎం యంత్రంలోని క్యాష్ కొట్టేయాలంటే చాలా పరికరాలు కావాలి.. అయితే.. ఇదంతా ఎందుకు అనుకున్న కొందరు మహారాష్ట్రలో ఏకంగా జేసీబీ తీసుకొచ్చేసి.. ఏటీఎంను పెకలించుకుపోయారు. సాంగ్లీ ప్రాంతంలో యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో ఈ తరహా ఘటన జరిగింది. ఈ జేసీబీతో చోరీ చేసిన దృశ్యాలు చక్కగా సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ ఫుటేజ్ ఆధారంగా ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.