ఇది నిజంగా తిరుపతి వెంకన్న భక్తులకు శుభవార్తే.. కరోనా నేపథ్యంలో గడచిన రెండు సంవత్సరాలుగా రద్దు చేసిన వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలను ఇప్పుడు టీటీడీ మళ్లీ అనుమతి ఇస్తోంది. వృద్ధులు, వికలాంగులు ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఆన్లైన్ సాఫ్ట్వేర్లో ఏర్పడిన టెక్నికల్ సమస్యతో ఏప్రిల్ ఒకటిన విడుదల చేయాల్సిన దర్శన టోకెన్లను ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈనెల తొమ్మిది నుంచి నెల చివరి వరకు రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున దర్శన టికెట్లు జారీ చేస్తారు. టీటీడీ ఆన్లైన్లో టోకెన్లు పొందిన భక్తులను ప్రతిరోజూ ఉదయం 10 గంటల సమయం అనుమతిస్తారు. దివ్యాంగుల క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం మాత్రం మధ్యాహ్నం మూడు గంటల సమయంలోనే దర్శనానికి అనుమతి ఇస్తారు.