తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా..? పంజాబ్ రైతుల కోసమా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల కోసమే సీఎం కేసీఆర్ ధర్నా చేశారని.. రైతుల కోసం చేయలేదని విమర్శించారు. చాలా విషయాల్లో బీజేపీ విజయం సాధించిందని, ఎప్పుడూ ఫామ్ హౌస్లో ఉండే సీఎంను బయటికి రప్పించామని వెల్లడించారు.
ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్.. అదే ధర్నా చౌక్ వద్ద కూర్చొన్నారని గుర్తు చేసారు. ధాన్యం కొనుగోలులో జాప్యం వల్ల రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్పిందా..? లేదా అని బండి ప్రశ్నించారు. వడ్లు వరదనీటిలో కొట్టుకుపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేసారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలంగాణ నాలుగవ స్థానం అని, తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు బండి సంజయ్.