శ్రీశైలంలో వైభవంగా కార్తీకమాసోత్సవాలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం కార్తీకమాసం ప్రారంభరోజు కావడంతో ఉదయం నుంచి భక్తుల తాకిడి మొదలైంది. పలువురు భక్తులు కృష్ణానదీలో స్నానం చేసే సమయంలో, దేవాలయం వద్ద కార్తీకదీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ నుంచి స్వామివారి గర్భాలయంలో స్పర్శదర్శనమును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
ముఖ్యంగా కార్తీకమాసం కావడం.. ప్రారంభరోజులో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతోనే స్వామివారి గర్భాలయంలో అభిషేకాలు తాత్కాలికంగా నిలుపుదల చేశాం అని ఆలయ ఈవో లవన్నవెల్లడించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్టవద్ద గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. అలాగే పాతాళగంగలో కూడ భక్తులు పుణ్య స్నానాలు చేసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో ఎక్కడ చూసిన భక్తులు కిటకిటలాడుతున్నారు.శుక్రవారం నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసం ఉత్సవాలు నిర్వహించనున్నారు. రోజుకు నాలుగు విడతలుగా ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహిస్తారు. కేవలం మల్లికార్జునస్వామి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుంది.