ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్?
హైకోర్టు దెబ్బకు వైసీపీ ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు.. పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు హైకోర్టుకు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమాణ పత్రం ఇచ్చారు. భవిష్యత్లో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయబోమంటూ ఆయన ప్రమాణపత్రం దాఖలు చేశారు. పార్టీ రంగులు వేస్తున్నారని జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్కుమార్ బుధవారం కోర్టులో వాదనలు వినిపించారు. పార్టీ రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని..గత నెలలో జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు విచారణ సందర్భంగా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేశారు. గతంలో కూడా అన్ని ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తుండటంపై హైకోర్టు సీరియస్ అయింది. దీనిపై ఎన్నో కేసులు నడిచాయి. ఇప్పటికే సచివాలయాలకు, ఇతర కార్యాలయాలకు, పంచాయితీ కార్యాలయాలకు వేసిన రంగులను ప్రభుత్వం తొలగించింది.