జగన్ ఢిల్లీ పర్యటన రద్దు?
ఢిల్లీలో ఆదివారం తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనాల్సిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పర్యటనను రద్దుచేసుకున్నారు. ఆయన స్థానంలో హోంమంత్రి మేకతోటి సుచరిత వెళ్లనున్నారు. ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణకడంతో వైద్యులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించడంతో ఆకస్మికంగా తన పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజే ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలే రద్దుకు కారణమయ్యాయని ప్రతిపక్షాలంటున్నాయి. ఢిల్లీ వరకు వెళ్లి హోంమంత్రిని వ్యక్తిగతంగా కలవకపోతే అవమానకరంగా ఉంటుందని, అపాయింట్మెంట్ ఖరారు కాలేదుకాబట్టి తనకు బదులుగా హోంమంత్రినికానీ, డీజీపీని కానీ పంపించాలనుకున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. అయితే చివరకు హోంమంత్రిని పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికితోడు కాలు కూడా బెణకడంతో పర్యటనను రద్దుచేసుకోక తప్పలేదు.