శాంతిస్తున్న గోదావరి వరద ప్రవాహంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాలు తగ్గుముకం పట్టడంతో వరద ప్రవాహం కూడా తగ్గింది. ఇదిలా ఉండగా గౌతమి, వైనతేయ, వృద్ధగౌతమి, వశిష్ఠ నదీపాయలు శాంతించడంతో క్రమంగా గోదావరికి వరద తగ్గుముకం పట్టింది. పి.గన్నవరం మండల పరిధిలోని గంటిపెదపూడి శివారు బూరుగులంక, అరిగెలవారిపేట, ఊడిమూడి, పెదపూడిలంక, శివారు ఊడిమూడిలంక గ్రామాలకు ఇటీవల కురిసిన వర్షాలతో రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ప్రస్తుతానికి అధికారులు ఏర్పాటుచేసిన రెండు ఇంజన్ పడవలపైనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతం కనకాయలంక కాజ్వేపై వరద ఉధృతి కొనసాగడంతో ఇంజన్బోట్ల పైనే లంకగ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అనగార్లంక, అయోధ్యలంక,పెదమల్లంక గ్రామస్తులు కూడా పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో లంక ప్రాంతాల్లో పలుచోట్ల మునగ, బీర, పచ్చిమిర్చి పంటలకు వరదపోటుకు గురయ్యాయి. ఒక్కసారిగా వరదనీరు తాకితే పంటలు పనికిరావని రైతులు గగ్గోలు పెడుతున్నారు.