ప్రపంచ ఆర్థిక రంగానికి కొత్తదారులను చూపిన అమర్త్యసేన్... నేడు జన్మదినం
1947లో దేశవిభజన తర్వాత భారతదేశానికి తిరిగివచ్చి విశ్వభారతి, ప్రెసిడెన్సీ కళాశాలలలో అభ్యసించాడు. కేంబ్రిడ్జిలోని ట్రినిటి కళాశాలలో 1956 గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్నాడు. 1959లో పి.హెచ్.డి పట్టా పుచ్చుకున్నాడు. సంక్షేమం వైపు, పేదరికం, నిరుద్యోగం వైపు అమర్త్యా సేన్ కృషి అమోఘమైనది. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు కనీస అవసరాలు ఎలాగో ప్రజాస్వామిక హక్కులు కూడా అంతే ముఖ్యమని ఉద్ఘాటించాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ రక్షణ బడ్జెట్ ను తగ్గించాలని హితవు పల్కినాడు. పేదరిక స్థాయిని నిర్థారించడానికి అమర్త్యా సేన్ సోషల్ ఛాయిస్ అనే నూతన సూత్రీకరణను ప్రవేశపెట్టాడు.
పేదరికానికి, కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాల కొరత కాదని, ఉపాధి లేకపోవడంతో ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేకపోవడమే ప్రధాన కారణమని తన అధ్యయనాల ద్వారా నిరూపించాడు. ప్ర్రాథమిక విద్య, ఆరోగ్యం ఏ దేశ అభివృద్ధిలోనైనా కీలక పాత్ర వహిస్తాయని ఉద్ఘాటించాడు. నీతిశాస్త్రం, తత్వశాస్త్రాల వెలుగులో అభివృద్ధి అర్థశాస్త్రానికి కొత్త రూపం చేర్చాడు.1943లో బెంగాల్ లో కరువు సంభవించినప్పుడు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన ఎంక్వైరీ కమిషన్ సకాలంలో వర్షాలు లేకపోవడం, బర్మా నుండి ధాన్యం దిగుబటి కాకపోవడం వంటి కారణాలను చూపించగా, అమర్త్యాసేన్ దానికి పూర్తిగా విరుద్ధమైన కారణాలను అర్థశాస్త్ర పరంగా విశ్లేషించి సంక్షేమ అర్థశాస్త్రానికి కొత్త రూపం ఇచ్చాడు.