అనుమతివ్వడానికి అభ్యంతరమేంటో?
న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల వరకు అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన పాదయాత్రకు అనుమతివ్వలేమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన అమరావతి పరిరక్షణ సమితికి లేఖ రాశారు. తాము శాంతియుతంగా పాదయాత్ర చేయాలనుకుంటుంటే పోలీసులు అనుమతివ్వడంలేంటూ రైతులు, రైతుసంఘాల నేతలు వాపోయారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి వెల్లడించింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 45 రోజులపాటు 450 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. తుళ్లూరు, తాడికొండ, గుంటూరు, పుల్లడిగుంట, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, కొవ్వూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి మీదగా తిరుమలకు చేరుకుంటుంది. అక్కడ ఏడుకొండలవాణ్ని రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుకొని మొక్కులు చెల్లిస్తారు. డిసెంబరు 17న తిరుపతిలో మహాసభ నిర్వహించనున్నారు. అయితే డీజీపీ అనుమతి నిరాకరణతో పాదయాత్ర సందిగ్ధంలో పడింది.