హిందువులలో పెళ్ళైన మహిళలు చేసుకునే ముఖ్యమైన వ్రతాలలో మంగళగౌరీ వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని మహిళలు ప్రధానంగా శ్రావణ మాసంలో చేస్తారు. ఈ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వివాహితలు తమ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఎంతో నిష్టగా, భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటు నాలుగు మంగళ వారాలు ఈ వ్రతం చేసి అధ్బుతమైన సానుకూలమైన ఫలితాలను పొందడానికి అత్యంత అనుకూలం. ఈ వ్రతమును చేపట్టిన మహిళలకు అమ్మవారి కృపాకటాక్షాలు అంది వారు పుణ్య స్త్రీలుగా వరాన్ని పొందగలరు అని శాస్త్రములు చెపుతున్నాయి.
ఈ వ్రతము మన ఇష్ట కార్యాలకు తప్పక సిద్ధిస్తుందని, ఈ వ్రతమును చేపట్టిన లక్షలాది మంది మహిళలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ వరము యొక్క విశిష్టత తెలుసుకోగా ఇపుడు ఈ వ్రత విధానం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాము. శ్రావణ మంగళవార వ్రతమును చేపట్టే మహిళలు ఇది తొలి సారి అయినట్లయితే అయిదుగురు ముత్తయిదువులని వ్రతానికి పిలిచి వారిని అమ్మవారిగా భావించి కాలికి పసుపు రాసి వాయినం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇక రెండవ సంవత్సరం అయినట్లయితే పదిమంది ముత్తైదువులకు వాయినం అందించాలి.
అదే మూడవ యేడు అయితే పదిహేను మందిని, నాలుగో ఏడు అయితే ఇరవై మంది ముత్తైదువులకు, అయిదవ సంవత్సరం అయితే ఇరవై అయిదు మంది ముత్తయిదువులను పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, పూలు సమర్పించి, కాటుకిచ్చి, శనగలు, కొబ్బరి, పండ్లను వాయినంగా ఇవ్వడం మన ఆచారం. పూజా సమయంలో అమ్మవారి ప్రతి రూపంగా పసుపుతో తయారు చేసిన అమ్మవారి రూపానికి కుంకుమ , గంధములతో అలంకరించాలి. ఇలా చేసిన పిమ్మట ఆఖరులో ఆ గౌరీ మాతను సౌభాగ్యాన్ని కలకాలం ఇమ్మని వేడుకోవాలి. ఈ విధంగా శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం చేస్తే అంతా శుభమే కలుగుతుంది.