వైరల్: ఒకే ఒక్క రూపాయితో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఉద్యోగి... ఎలాగబ్బా?

Suma Kallamadi
అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. కమ్యూనిటి హెల్త్ సెంటర్‌లో పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి, రోగి నుంచి రూ.1 అధికంగా వసూలు చేశాడనే ఆరోపణలు రావడంతో, విధుల నుంచి తొలగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌, మహారాజ్‌ గంజ్ జిల్లాలోని జగదౌర్ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళితే... జగదౌర్ గ్రామంలోగల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సోమవారం సంబంధిత అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఫార్మసిస్ట్.. "తన వద్ద నుంచి రూ.1 అధికంగా వసూల్ చేసాడు!" అంటూ ఎమ్మెల్యే పటేల్‌కు ఓ రోగి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఫార్మసిస్ట్‌పై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.
కట్ చేస్తే, జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ, సదరు కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అయితే అప్పటికే అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది ఆలక్ష్యంగా ఉంటున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో అధికారులు వచ్చిందే అవకాశం అనుకొని ఆ ఒక్క రూపాయి లంచంగా తీసుకున్న అధికారిపై వేటు వేశారు. దాంతో ఒక్క రూపాయి అధికంగా వసూల్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎమ్మెల్యే నిలదీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అనేవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఆ ఆసుపత్రుల్లో రూ. 1కే రోగులకు మందులు అమ్ముతూ ఉంటారు. అయితే సదరు కాంట్రాక్ట్ ఉద్యోగి మాత్రం రోగి నుంచి అదనంగా మరో రూపాయి కలుపుకొని రూ.2 వసూల్ చేశాడు. దాంతో అక్కడి స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో తనిఖీల సందర్బంగా ఆసుపత్రిలోని రోగులతో బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ మాట్లాడుతూ... ఆసుపత్రిలోని ప్రసూతి కేంద్రంలో రాత్రి వేళల్లో మహిళా వైద్యులు లేరని సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. అలాగే ఆసుపత్రిలో వైద్యులు రాసిన మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తుందని కూడా రోగులు ఆవేదన వ్యక్తం చేశారని, త్వరలో ఈ అంశాన్ని జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని పటేల్ ఈ సందర్భంగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: