ఏదైనా జరగాలని రాసిపెట్టింటే అట్లే జరుగుతుంది.. బ్రహ్మ రాతను ఎవరూ మార్చలేరు. యాపిల్ పండ్లు ఎక్కడ, యాపిల్ ఫోన్ ఎక్కడ.. పండ్లను ఆర్డర్ చేస్తే ఐఫోన్ రావడంతో ఓ వ్యక్తి ఎగిరి గంతేశాడు. మాములుగా ఖరీదైన వస్తువులు ఆర్డర్ ఇస్తే.. చీప్ వస్తువులను అందించిన మోసగించిన కథనాల్ని చూశాం. అంతేకాదు లగ్జరీ ఫోన్లకు బదులు, ఇటుకలు, డమ్మీ ఫోన్లు డెలివరీ, ఆపిల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే ఆపిల్ ఫ్లేవర్ డ్రింక్ ఇచ్చిన వైనాన్ని కూడా చూశాం.
ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు భిన్నంగా ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆన్లైన్లో యాపిల్ పండ్లను ఆర్డర్ చేస్తే..ఏకంగా ఖరీదైన యాపిల్ ఫోన్ వచ్చింది. ట్వికెన్హామ్కు చెందిన 50 ఏళ్ల నిక్ జేమ్స్ ఈ అరుదైన జాక్ పాట్ కొట్టేశారు. స్వయంగా ఆయనే ఈ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త ఆ నోటా .. ఈ నోటా పాకి వైరల్ అయ్యింది. ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది. బయటకు వెళ్లి కొనుక్కోవడం పక్కన పెట్టి అందరూ ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు.
బ్రిటన్లో జేమ్స్ ఆన్లైన్లో కొన్నియాపిల్ పండ్ల కోసం సూపర్ మార్కెట్కు ఆర్డర్ ఇచ్చారు. అయితే పార్సిల్లో పండ్లతో పాటు యాపిల్ ఐఫోన్ ఎస్ఈ కూడా రావడంతో ఎగిరి గంతేశాడు. కానీ ఈస్టర్ సందర్భంగా ఏదైనా ప్రాంక్ చేశారేమో అనుకుని కొద్దిగా అనుమానించాడు. అయితే టెస్కో మార్కెట్ కంపెనీ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అని తెలుసుకుని జేమ్స్ను సూపర్ థ్రిల్ అయ్యాడు. విషయం ఏమిటంటే.. టెస్కో గ్రోసరీ సంస్థ ప్రమోషనల్ క్యాంపేన్లో భాగంగా యాపిల్ పళ్లతో పాటు ఐఫోన్ స్పెషల్ ఎడిషన్ ఫోన్ను గిఫ్ట్గా అతనికి అందించిందన్నమాట. 'సూపర్ సబ్స్టిట్యూట్'లో రెగ్యులర్ అవసరమైన వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు యాపిల్ ఐఫోన్లు, ఎయిర్పాడ్స్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఊహించని బహుమతులుగా అందిస్తోందట