
నీరజ్ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే.. దిమ్మ తిరిగిపోద్ధి ?
జూవేలిన్ త్రో లో ఏకంగా భారత్కు స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. 87.58 మీటర్ల దూరం విసిరి ఈ బల్లెం వీరుడు దేశ ప్రజల గౌరవాన్ని నిలబెట్టాడు. దీంతో రాష్ట్రపతి ప్రధానమంత్రి దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా ఇక నీరజ్ చోప్రా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే దేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టిన నీరజ్ చోప్రా కు ఎన్నో ఏళ్ల నుంచి అటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీగానే ఖర్చు పెడుతూ వస్తోంది. మొదట 2012లో అండర్ 16 చాంపియన్గా నిలిచాడు నీరజ్ చోప్రా. ఆ తరువాత 2015లో జూనియర్ ఛాంపియన్ షిప్ లో కూడా విజేతగా నిలిచాడు. ఇక అండర్ 20 ఛాంపియన్షిప్లో ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పి వెలుగులోకి వచ్చాడు. 86.48 మీటర్లు విసిరి ప్రపంచ క్రీడా లోకం మొత్తాన్ని ఆశ్చర్య పరిచాడు.
అయితే ఒలంపిక్స్లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడానికి వెనక ఎంతో కష్టం దాగి ఉంది అని చెప్పాలి. ఇక ప్రభుత్వం నుంచి కూడా నీరజ్ చోప్రా కి పూర్తిస్థాయి మద్దతు అందింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఒలంపిక్స్ ప్రారంభమయ్యే ముందు 450 రోజులపాటు నీరజ్ చోప్రా విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 4,85,39,638 రూపాయలను నీరజ్ చోప్రా కోసం ఖర్చు చేసింది. ఇక 2019లో నీరజ్ చోప్రాకు మోచేయి శస్త్ర చికిత్స జరిగింది. ఆ తర్వాత నీరజ్ చోప్రా కి వ్యక్తిగత కోచ్గా డాక్టర్ క్లాస్ బార్టోనియెట్జ్ నియమించబడ్డారు . ఆయనకు వేతనంగా ప్రభుత్వం రూ.1,22,24,880 రూపాయల వరకు చెల్లించింది. నీరజ్ ప్రాక్టీస్ చేయడం కోసం కొనుగోలు చేసిన నాలుగు జావెలిన్లకు రూ.4,35,000 ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం . ఒలింపిక్స్కు కొద్ది రోజుల ముందు 2021లో నీరజ్ చోప్రా యూరప్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే 50 రోజుల పాటు స్వీడన్లో ఉండాల్సి వచ్చింది. ఇలా నీరజ్ చోప్రా స్వీడన్ లో ఉన్న సమయంలో అతనికి సంబంధించిన అన్ని చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.19,22,533 ఖర్చు చేసింది.