ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ లో గాయపడడంతో ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న టీ 20 సిరీస్ కు టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే గాయం నుండి కోలుకోవడానికి మరి కొన్ని రోజుల సమయం పట్టనుండడం తో విండీస్ తో వన్డే సిరీస్ కు కూడా ధావన్ అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. ధావన్ గాయం కుట్లు విప్పాము. అయితే ఆ గాయం తగ్గడానికి మరికొన్ని రోజులు పడుతుందని బీసీసీఐ వైద్య బృందం బీసీసీఐ కి నివేదిక ఇచ్చింది. దాంతో సెలక్షన్ కమిటీ ధావన్ స్థానంలో విండీస్ తో వన్డే సిరీస్ కు మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసింది. నిజానికి ధావన్ స్థానం కోసం మయాంక్ తోపాటు సంజు శాంసన్ , శుభమాన్ గిల్ లు కూడా పోటీపడ్డారు. అయితే లిస్ట్ ఏ క్రికెట్ లో 50సగటు తో పరుగులు చేసి వారిద్దరికన్నా మయాంక్ ముందుండడంతో అతనికే అవకాశం దక్కింది.
ఇప్పటికే టెస్టుల్లో పర్మినెంట్ ఓపెనర్ గా సెటిల్ అయిన మయాంక్ తాజాగా వన్డే ల్లో కూడా స్థానం దక్కించుకున్నాడు. అయితే విండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు మయాంక్ కు తుది జట్టులో అవకాశం వస్తుందనేది అనుమానమే. ఎందుకంటే రోహిత్ శర్మ తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఒకవేళ రాహుల్ విఫలమైతే గనుక మయాంక్ కు ఒక్క మ్యాచ్ లోనైనా అవకాశం రావడం గ్యారెంటీ. ఇకమూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా ఈనెల 15న చెన్నై లో వెస్టిండీస్ తో టీమిండియా మొదటి మ్యాచ్ లో తలపడనుంది.