వరలక్ష్మీ వ్రతం: సాయంత్రం ఖచ్చితంగా చేయాల్సిన పనులివే
ఇవి అందరికీ తెలిసుండకపోవచ్చు, లేదా అవగాహన లేక పోవచ్చు. అవేంటో తెలుసుకుని ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా వరలక్ష్మీ వ్రతాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తే ఆ శ్రీ మహా లక్ష్మి కరుణా కటాక్షలు పొందగలరు. చాలామంది వరలక్ష్మీ వ్రతాన్ని పొద్దున్నే చేస్తుంటారు. ఏ మాత్రం లోటు లేకుండా పూజను ఉన్నంతలో ఎంతో ఆర్భాటంగా చేయాలనుకుంటారు. అమ్మవారి అనుగ్రహం కోసం ముత్తైదువులకు వాయినాలు కూడా ఇస్తుంటారు. పసుపుతో చేసిన అమ్మవారు, అలాగే పసుపుతో చేసిన గణపతిని పూజలో ఉంచి వ్రతాన్ని చేస్తారు. అయితే కొంతమంది సాయంత్రం మాత్రం పూజ చేయరు. ఉదయం ఎంతో శ్రద్ధగా పూజ చేశాం కదా, ఇక ఇప్పుడు సాయంత్రం పూజ చేయనక్కర్లేదులే అని భావిస్తారు. మరికొందరు పూజ చేస్తారు కానీ నైవేద్యం వంటివి ఏమి పెట్టకుండానే కేవలం దీపారాధన చేసి మమ అనుకుంటుంటారు.
అయితే ఇలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు వేదపండితులు. ఇంట్లో ఉదయం వరలక్ష్మీ వ్రతం చేసాము అంటే .. సాయంత్రం కూడా ఖచ్చితంగా నిత్య దీపారాధన చేయాలట. అంతే కాకుండా సాయంత్రం మరల ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలట. ఉదయం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా స్వీకరించాలి. అలాగే వరలక్ష్మీ వ్రతం రోజున సాయంత్రం కూడా మరల తియ్యటి నైవేద్యాన్ని సమర్పించాలి. పూజ అనంతరం ఆ నైవేద్యాన్ని చిన్నారులకు ప్రసాదంగా ఇస్తే వ్రత ఫలితం పూర్తిస్థాయిలో దక్కుతుందట. కాబట్టి ఉదయం వరలక్ష్మీ వ్రతం ఎంత వైభవంగా చేసినా సరే... మరలా సాయంత్రం పూట కూడా ప్రత్యేక నైవేద్యం సమర్పించి నిత్య దీపారాధన చేయాలనీ గుర్తుంచుకోండి. ఇలా చేయడం వలన అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు మీ ఇంట కొలువై ఉంటాయి.