మీకు సంతానం లేదా? ఉద్యోగ ఇబ్బందులు ఉన్నాయా? ఐతే స్వామిని పూజించండి
మీకు సంతానం లేదా? ఉద్యోగ ఇబ్బందులు ఉన్నాయా? నేడు శ్రి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఎందుకంటే ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి అమోఘమైన సుదినం శ్రీ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై సకల లోకవాసులను హింసిస్తూ ఉండడం తో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అందుకు "శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు తపస్సు మానేసి పార్వతీ దేవిని పరిణయమాడునట్టు చేస్తే వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు" అని ఉపాయం చెప్పాడు.
ఈ మాటలను విన్న దేవతలు, శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలాగా చేసేందుకు మన్మథుడిని పంప గా శివుడు తన మూడవనేత్రం తెరిచి మన్మథుడిని దహించి వేశాడు. అయితే తారకాసురుడి ని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు.
పార్వతీ పరమేశ్వరులు శృంగారంలో తేలియాడుతూ తమకమలో ఐఖ్యమై ఉన్నపుడు శివుడి రేతస్సు (వీర్యం) పతనమై భూమిపై పడింది. దానిని భూమి భరించ లేక అగ్నిలో పడవేసింది. అగ్నిదానిని భరించ లేక గంగలో వదలగా దానిని గంగ తన తీరంలోని శరవణము (రెల్లు పోద)వైపుకు తోసివేసింది. అక్కడే శ్రీకుమారస్వామి జన్మించాడు. శరవణమున జన్మించిన వాడు కనుక స్వామికి "శరవనబహ్వుడు" అనే పేరు ఏర్పడింది.
అంతేకాకుండా గంగానదిలో పడిన రేతస్సు ఆరుభాగాలుగా విడిపోగా ఆ ఆరు భాగాలు అలలతాకిడికి ఏకమై ఆరు ముఖములు పన్నెండు చేతులు, రెండు కాళ్ళతో ప్రత్యేక స్వరూపం తో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి జన్మించాడు. అందువల్ల ఆయనకు "షణ్ముఖుడు" అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆవిర్భవించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరు "కృత్తిక" లను నియమించారు. వారు పెంచి పెద్ద చేశారు. ఆరు కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి "కార్తికేయుడు" అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి "తారకాసురుడి" పై దండెత్తి అతనిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించినట్లు పురాణకథనం.
తారకాసురుడి మరణం తరవాత వాడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉండడంతో సుబ్రహ్మణ్య స్వామి శూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడు. యుద్ధంలో ఆరవరోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో, నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటు న్నట్లు పురాణ కథనం.
శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఇద్దరు దేవేరులున్నారు. శ్రీవల్లీదేవి, శ్రీదేవసేనలు. తారకాసురుడిని అంత మొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి వివాహం చేయగా, తిరుత్తణి ప్రాంత పాలకుడైన నంది రాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నట్లు పురాణ కథనం.
ఆరు ముఖములు, పన్నెండు చేతులు కలిగి నెమలి వాహనుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్న శివపార్వతుల గారాల బిడ్డ దేవసేనలకు నాయకుడు కేవలం కావడి మొక్కులను సమర్పించినంతనే భక్తులకు వంశాభివృద్ధిని, బుద్ధి, సమృద్ధిని ప్రసాదించే భక్తసులభుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు జన్మించిన పవిత్ర పర్వదినం "శ్రీ సుబ్రహ్మణ్య షష్టి" ప్రతి సంవత్స రం మార్గశిర మాసం శుక్ల పక్ష షష్టి నాడు ఈ పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. ఈ పర్వదినానికి సుబ్బరాయషష్టి, కుమార షష్టి, స్కందషష్టి, కార్తికేయషష్టి, గుహ ప్రియా వ్రతం వంటి పేర్లున్నాయి.
పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగివెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివ + శక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని"ఇదంబుడు" అనే తన శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాల ను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు అలా కావడి లో రెండు పర్వాతాలను మొస్తూ మార్గ మద్యంలో పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికై ఆగాడు.
కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దాని పై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు ఇదంబుడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు సమసి పోతాడు. ఈ విషయం తెలుసుకున్న అగస్త్యుడు ప్రార్థించడంతో కుమారస్వామి తిరిగి ఇదంబుణ్ణి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారి కి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. ఈతే కావడికి ఉపయోగించే బద్ద "బ్రహ్మదండం" అనీ ఐ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.
సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటిరోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసంను విరమించాలి. అంతే కాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజచేసి పుట్టలో పాలు పోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా కుజ, రాహు, కేతు, సర్పదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితా లుంటాయని చెప్పబడుతూ ఉంది.
వీటికి తోడు ఈ రోజు "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం సుబ్రహ్మణ్యషష్టి జరుపు కోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి, సమృద్ధి కలుగు తాయి.
షడాననం చందన లేపితాంగం
మహారసం దివ్య మయూర వాహనం
రుదస్య నూనుం సురలోకనాథం
శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.