హెరాల్డ్ సెటైర్ : విచారణ నుండి తప్పించుకు తిరుగుతున్న డాక్టర్..భలే కారణం చెప్పాడే

Vijaya
ఎలాగైనా సరే పోలీసు విచారణ నుండి తప్పించుకోవాలని డాక్టర్ పోతిన రమేష్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. విజయవాడలోని స్వర్ణాప్యాలెస్ హోటల్లోని కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదంలో పదిమంది చనిపోయిన విషయం గుర్తుందికదా. ఆ సెంటర్ నిర్వాహకుడు ఈ డాక్టర్ రమేషే. అగ్నిప్రమాదం జరిగిన దగ్గర నుండి చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు డాక్టర్. ఈయన కోసం గాలింపు చర్చలు జరిపి ఎంతకీ దొరక్కపోయేటప్పటికి చివరకు పట్టిచ్చిన వాళ్ళకు పోలీసులు లక్ష రూపాయల బహుమతి కూడా ప్రకటించారు.



ఎక్కడెక్కడ తిరిగాడో తెలీదు కానీ మొత్తానికి సడెన్ గా కోర్టును అప్రోచ్ అయ్యాడు. తనపై పోలీసులు ఎటువంటి విచారణ జరపకూడదంటూ కోర్టులో స్టే కూడా తెచ్చుకున్నాడు. అయితే ప్రభుత్వం హైకోర్టిచ్చిన స్టే పై సుప్రికోర్టుకెళ్ళింది. అక్కడ రమేష్ ను విచారించచ్చంటూ పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో పోలీసులు రమేష్ కు నోటీసిచ్చి విచారణకు హాజరుకావాలి రమ్మన్నారు. అయితే ఇక్కడే డాక్టర్ తన తెలివి తేటలంతా చూపించారు. తనకు కరోనా వైరస్ ఉందని ఒకసారి కరోనా వైరస్ భయంతో తాను బయటకు తిరగలేకపోతున్నట్లు మరోసారి పోలీసులకు రాసిన లేఖలో చెప్పారు.



పోలీసుస్టేషన్ అంటే అందరు తిరిగే చోటు కాబట్టి తనకు కరోనా వైరస్ సోకుతుందనే భయం ఉంది కాబట్టి విచారణకు హాజరుకాలేనంటూ చెప్పేశారు. అయితే పోలీసులకు రమేష్ ఒ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అదేమిటంటే తనను పోలీసులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ చేసుకోవచ్చట. అంటే డాక్టర్ లెక్క ప్రకారం ఈయనొక్కడిదేనా ప్రాణం ? కరోనా వైరస్ ను కూడా లెక్క చేయకుండా డ్యూటీలు చేస్తున్న పోలీసులు, ఇతర డాక్టర్లది ప్రాణాలు కాదా ? అసలు తన కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగేంత వరకు కూడా రమేష్ యధేచ్చగా బయటకు తిరిగినవాడేనట.



పదిమంది ప్రాణాలు పోవటానికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, విచారణకు సహకరించకుండా పోలీసుల నుండి తప్పించుకు తిరిగిన డాక్టర్, అసలు కరోనా లేకపోయినా రోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ కూడా కరోనా వల్ల ప్రాణభయం ఉందని చెప్పటమే విచిత్రంగా ఉంది. పైగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ చేసుకోవచ్చనే ఉచిత సలహా ఒహటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: