హెరాల్డ్ సెటైర్ : అమ్మోనియం నిల్వలకన్నా ఎల్లోమీడియా వల్ల ప్రమాధమే ఎక్కువా ?
ఇంతకీ ఎల్లోమీడియా తాజా గోలకు కారణం ఏమిటంటే ఎక్కడో లెబనాన్ రాజధాని బీరుట్ లోని ఓ పోర్టులో అమ్మోనియం నిల్వలున్న గోడౌన్లో పేలుడు జరిగింది. ఆ పేలుడులో వందలాదిమంది చనిపోయారు. అంతవరకూ బాగానే ఉంది. వార్త ఇవ్వటంలో తప్పేమీలేదు. కానీ అక్కడెక్కడో జరిగిన ప్రమాదం లాంటిది విశాఖపట్నంలో కూడా జరిగే అవకాశం ఉందికాబట్టి వైజాగ్ రాజధానిగా పనికిరాదని జనాలను భయపెట్టే ప్రయత్నాలు చేయటమే మరీ విచిత్రంగా ఉంది. వైజాగ్ పోర్టులో కూడా అమ్మోనియం నిల్వలుంటాయి. కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉందట. బోడిగుండుకు మోకాలికి ముడేయటమంటే ఇదే. ఎక్కడ బీరుట్ ఎక్కడ వైజాగ్. అమ్మోనియం నిల్వలు ఒక్క వైజాగ్ లోనే అనేముంది ? దేశంలోని చాలా ప్రాంతాల్లో నిల్వలను ఉంచుతున్నారు. ఎక్కడ అమ్మోనియంను నిల్వలుంచినా ప్రమాదాలు జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైజాగ్ జనాలను భయపెడుతు గతంలో ఎప్పుడూ ఎల్లోమీడియా ఈ స్ధాయిలో వార్తలు, కథనాలు అచ్చేసింది లేదు. ఎప్పుడైతే జగన్ వైజాగ్ రాజధానిగా ప్రకటించాడో అప్పటి నుండే నెగిటివ్ కథనాలు, వార్తలు వండి వార్చటం మొదలైంది. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సిపిఐ, ఎల్లోమీడియా కూలబలుక్కున్నట్లే జగన్ పై విషంచిమ్మటం మొదలుపెట్టారు. దాంతో వైజాగ్ పైన కూడా నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టేశారు. గతంలో కూడా వైజాగ్ లో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అప్పుడెప్పుడూ విశాఖ నగరంపై ఈ స్ధాయిలో ఎల్లోమీడియా విషం చిమ్మలేదు. ఇపుడే ఎందుకు ఇలా జరుగుతోందంటే తమకిష్టం లేని పని, తాము వద్దన్నా వినకుండా జగన్ తాను అనుకున్నట్లే చేసుకుపోతున్నాడు కాబట్టే.