20-20 క్రికెట్లో చాలా పసికూనల్లాంటి దేశాలు కూడా పెద్ద జట్లకు షాకులు ఇస్తూ... రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తున్నాయి. ఇటీవల నెదర్లాండ్, నమీబియా, అమెరికా, స్కాట్లాండ్, ఐర్లండ్, అప్ఘనిస్తాన్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా ఈ పొట్టి క్రికెట్లో దూసుకుపోతున్నాయి. ఇక ఆసియా ఖండంలోనూ యూఏఈ, ఒమన్, హాంకాంగ్ లాంటి జట్లు విజృంభిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీ 20 క్రికెట్లో యూరప్ దేశమైన రొమేనియా అరుదైన రికార్డు సృష్టించింది.
రొమేనియా కప్ 2019లో భాగంగా టర్కీతో జరిగిన మ్యాచ్లో రొమేనియా 173 పరుగుల తేడాతో విజయం సాధించి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా రొమేనియా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు శ్రీలంకపై ఉంది. శ్రీలంక జట్టు 2007లో కెన్యాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 172 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇప్పుడా రికార్డును ఒక్క పరుగు తేడాతో రొమేనియా బద్దలుగొట్టింది. రొమేనియా టర్కీపై ఏకంగా 173 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రొమేనియా ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో రొమేనియా ఆటగాడు శివకుమార్ పెరియల్వార్ 40 బంతుల్లో 105 పరుగులతో చెలరేగాడు. లక్ష్య ఛేదనలో టర్కీ 13 ఓవర్లలో 53 పరుగులకే కుప్పకూలి భారీ ఓటమిని మూటగట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన శివకుమార్ తమిళనాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్. రొమేనియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడ్డాడు. 31 ఏళ్ల శివకుమార్ తమిళనాడులో చదువుకుంటున్నప్పుడే చాలా క్రికెట్ టోర్నమెంటులలో ఆడాడు. అక్కడకు వెళ్లాక అక్కడ తన ఆట తీరుతో అక్కడి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. కాగా, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్టుగా రొమేనియా సరికొత్త చరిత్ర లిఖించగా, ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక (172), పాకిస్థాన్ (143), భారత్ (143), ఇంగ్లండ్ (137) జట్లు ఉన్నాయి.