మంచిమాట: బాధ భరించినప్పుడే విలువ తెలుస్తుంది..!!

Divya
సోమపురం అనే గ్రామంలో శివయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఆయనకి ఒక కొడుకు.. అతని పేరు రాము.. మహా సోమరి.. పెద్దవాడైనా సరే.. ఏ పనీ చేయకుండా తిరుగుతుండేవాడు. ఈ విషయంలో శివయ్య ఎన్ని సార్లు మందలించినా పట్టించుకునేవాడు కాదు. చేసేదేం లేక శివయ్య బాధ పడుతూ ఉండేవాడు. ఒకరోజు సోమపురానికి కాశీ నుంచి ఒక సాధువు వచ్చాడు. ఆయన దగ్గరికి ఊళ్లోని వాళ్లంతా ఆశీస్సులు తీసుకొని తమ సమస్యలను చెప్పుకున్నారు. వాళ్లలో శివయ్య ఏమి మాట్లాడకపోయినా దిగులుగా ఉండటం గమనించిన సాధువు.. దగ్గరకు పిలిచి విషయం కనుక్కున్నాడు. సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడేటప్పుడు ఈ ఊర్లో ఒక బద్ధకస్తుడు ఉన్నాడు.

అతని వల్లే ఊరికి చెడు జరుగుతుంది. వచ్చే గురువారం అతని ఇంట్లో వాళ్ళు మాయమైపోతారు. అని చెప్పాడు గురువారం వచ్చేసరికి రాము తల్లిదండ్రులు కనిపించడం లేదన్న వార్త ఊరంతా గుప్పుమంది. అంతే ఇతని వల్లే ఊరికి చెడు జరుగుతుంది అంటూ అందరూ రాముని దూరం పెట్టారు. ఇంట్లోవాళ్లు లేకపోవడంతో అన్నం కోసం కూడా అతడు బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని భరించలేని రాము స్వామి కాళ్ళ మీద పడ్డాడు. తనే నేరం చేయకపోయినా తనని అందరూ అసహ్యించుకుంటున్నారని బోరు మన్నాడు. అప్పుడు సాధువు నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూసుకోవలసిన వయసులో ఏ పని చేయకుండా ఊరికే తిని తిరుగుతూ కాలం గడుపుతున్నావు.

 నీ బాధ్యతల్ని నిర్వహించకుండా ఉండటం నేరము కాదా.. అని అన్నాడు. దీంతో తప్పు తెలుసుకున్న రాము కష్టించి పని చేయటం మొదలు పెట్టాడు. ఇప్పుడు తల్లిదండ్రులు రాముని చూస్తే ఎంతో సంతోష పడతారని అనుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్లకు సాధువు మళ్లీ ఆ ఊరికి వచ్చాడు. అందరితో మాట్లాడుతూ బద్ధకస్తుడు మారిపోవటం వల్ల అతని ఇంట్లో వాళ్లు తిరిగి వస్తారు అని చెప్పారు. మర్నాడే రాము తల్లిదండ్రులు ఊర్లో అడుగుపెట్టారు.అంతా స్వామి మహిమ అని ఊర్లో వాళ్లు చెప్పిన రాము తల్లిదండ్రులు తమ కొడుకుని మార్చినందుకు స్వామికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: