గతంలో జరిపిన మహానాడు కు ప్రస్తుతం జరిగిన మహానాడు భిన్నంగా జరిగిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఎర్పాటైన తరువాత జరిగిన మొదటి కార్యక్రమం కావడంతో మంచి సక్సెస్ నిచ్చి తెలంగాణ టిడిపి నాయకుల్లో కొత్త ఉత్సహాన్ని నిప్పిందనటం లో సందేహం లేదు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ బలపడుతుందంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఏది ఎమైనప్పటికి చంద్రబాబు తెలంగాణ ప్రజల్లో మెప్పు పోందుటకు పయత్నాలు మాత్రం బాగానే చేశారు. తెలంగాణలో రానున్నరోజుల్లో ఆధికారం మాదేనని ప్రకటించేశారు. ఓయూ భుముల విషయంలో ఆధికారపార్టీ కొంచెం సురుకంటించారు.
తెలంగాణలో మహానాడు నిర్వహణకు కారణం ఏమిటి?
తెలుగుదేశం అధికారంలో వున్న ఆంధ్రప్రదేశ్లో కాకుండా, బలహీనపడిన తెలంగాణలో మహానాడు నిర్వహణకు కారణం ఏమిటి?. సభలు ఎక్కడ నిర్ణయించుకోవాలనేది ఆ పార్టీకి సంబంధించిన విషయం. తెలంగాణలో జవసత్వాలు తగ్గిన టిడిపికి ఈ మహానాడు ఊపిరులూదగల్గుతుందా అనేదే ప్రశ్న?. ఇంతటితో తెలంగాణ ప్రజలు చంద్రబాబును నమ్ముతారా..? గతంలో పార్టీ చేసిన తప్పిదాలను ఒక్క మహానాడు కార్యక్రమంతో సమసిపోతాయా అన్న సందేహాలు ఉన్నాయి .ఇక్కడి నాయకత్వం సామర్థ్యం గురించి చర్చ కూడా తెలిసిందే. నిజానికిది నాయకత్వం సమర్థతకు సంబంధించిన సమస్య కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంతకాలం నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళినంత పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తాయి
తరువాత కూడా రియల్ఎస్టేట్ సమస్యల మీద చూపిన శ్రద్ధ ప్రజాసమస్యల మీద చూపించలేకపోయారు. జనం సమస్యలు విస్మరించిన పార్టీ పునరుత్తేజం పొందగలదా? తెలంగాణ టిడిపి నాయకులు ఈ మాత్రం తెలియని అమాయకులు కారు. వీరి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. విద్యుత్, సాగునీరు, ఉద్యోగుల విభజన, హైదరాబాద్లో శాంతిభద్రతల వంటి అనేక సమస్యల మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తాయి. వీటిమీద ఎట్లా స్పందించాలో దిక్కుతోచని స్థితిలో టిడిపి నాయకత్వం పడింది.
తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని చెబితే
తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని చెబితే తమ నేత చంద్రబాబునాయుడ్ని వ్యతిరేకించిన వారవుతారు. చంద్రబాబు వైఖరిని సమర్థిస్తే తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శకు గురవుతారు. సూత్రబద్ధమైన విధానాలులేని ఫలితం ఇది. రైతుల ఆత్మహత్యలకు నాటి టిడిపిపాలన కూడా ఒక కారణమే. కాంట్రాక్టీకరణకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పాలనలోనే. ప్రపంచబ్యాంక్ ఒప్పందాల పేరుతో పారిశ్రామికవేత్తలకు అనుకూలంగానూ, కార్మికులకు వ్యతిరేకంగానూ బహిరంగంగానే నాటి టిడిపి ప్రభుత్వం నిలబడింది. అసంతృప్తి చెందిన ప్రజలు పోరాటాలు చేసినప్పుడు ఉక్కుపాదంతో అణచే ప్రయత్నం చేసింది.
తెలంగాణలో టిడిపి పుంజుకుంటుందన్న గ్యారంటీ ఏమీలేదు
అందుకే ఈ సమస్యలమీద ప్రజలను కదిలించగలిగే స్థితిలో లేదు. ఇప్పుడు కేంద్రంలో బిజెపి ఆర్థిక విధానాలకు ఇక్కడ టిడిపి, టిఆర్ఎస్ల విధానాలకు మౌలికమైన తేడాలేదు. అందువల్ల మహానాడు నిర్వహించినంత మాత్రాన తెలంగాణలో టిడిపి పుంజుకుంటుందన్న గ్యారంటీ ఏమీలేదు. విధానాలు మారడం కీలకం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది ఆత్మగౌరవం కోసమేనని, అధికారకాంక్షతో కాదని చంద్రబాబు చెప్పారు. ఇంకా ఎన్టీఆర్ పేరుతోనే నెట్టుకురావడం సాధ్యం కాదు. సమకాలీన సమస్యలపైన ప్రజానుకూల విధానాలు అవసరం. కేంద్రంతో సహకరించాలన్న పేరుతో బిజెపితో చేతులు కలిపిన తర్వాత లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం విషయంలో కూడా టిడిపి వైఖరి మౌలికంగానే మారింది.
దేశరాజకీయాల్లో టిడిపి పెనుమార్పులు తెచ్చిందని కూడా చెప్పుకున్నారు. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ కేంద్రంతో పోరాడిన ఫలితమే తప్ప అది కేంద్రం ముందు తలవంచడంతో సాధించింది కాదు. అందుకే గత కాలపు వైభవాల గురించి చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు తమ విధానాలను మార్చుకొనేందుకు ఏమేరకు సిద్ధంగా వున్నారన్నదే మౌలిక సమస్య. తెలంగాణలో టిడిపి శ్రేణులకు విశ్వాసం నింపడంలో తెలుగుదేశం నాయకత్వం ఏమేరకు విజయం సాధించగలదో వేచిచూడాల్సిందే.