డల్లాస్లో లోకేష్ 'రెడ్ బుక్' వార్నింగ్: 'తప్పు చేసిన వాడిని వదిలే ప్రసక్తే లేదు' !
ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ... 'వై నాట్ 175' అంటూ ఊదరగొట్టిన వారికి ప్రజలు 'వై నాట్ 11' తో షాక్ ఇచ్చారని, కూటమికి 164 సీట్లు దక్కడంలో ప్రవాసాంధ్రుల పాత్ర మరవలేనిదని లోకేష్ ప్రశంసించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో తిరిగి పట్టాలెక్కించి, ఆంధ్రప్రదేశ్ వేగానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం .. కూటమి ప్రభుత్వం యువత కోసం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని లోకేష్ ఈ సందర్భంగా వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని లోకేష్ గంభీరంగా ప్రకటించారు. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి, తామే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని లోకేష్ ఆకాంక్షించారు. అలాగే, విదేశాల్లోని తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా APNRT అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రెడ్ బుక్ ఉందంటే ఉందంతే! .. చివరగా లోకేష్ చేసిన 'రెడ్ బుక్' వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. "రెడ్ బుక్ ఉందంటే ఉందంతే! తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఏపీలో అరాచక పాలన చేసిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదు" అంటూ లోకేష్ చేసిన హెచ్చరికలు ప్రతిపక్ష వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. ప్రవాసాంధ్రులను కొండంత బలమని చెబుతూనే, విపక్ష నేతలకు గట్టి వార్నింగ్ ఇస్తూ లోకేష్ డల్లాస్ సభను విజయవంతంగా ముగించారు. ఈ పర్యటన ద్వారా లోకేష్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది.