ఏపీలో కొత్త జిల్లాలు... కాంట్ర‌వ‌ర్సీలు త‌ప్ప‌వా... ?

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా పునర్వ్యవస్థీకరణ కీలక దశకు చేరింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, సరిహద్దుల సవరణలు, పేర్ల మార్పులపై ప్రభుత్వం తుది నిర్ణయానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలో మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలసి ప్రతిపాదనలపై చర్చించనుంది. ఆయన సూచనలతో తుది నివేదికను సిద్ధం చేసి, నవంబర్ 7న జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. జనగణన కారణంగా ఈ ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ప్రధానంగా ఉంది. ఇందులో కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలను కలపాలని నిర్ణయించే అవకాశం ఉంది. ఇదే సమయంలో అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రజా డిమాండ్‌కి అనుగుణంగా ప్రతిపాదన సిద్ధమైంది.


అలాగే ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ప్రస్తుత పాడేరు జిల్లా కేంద్రం నుంచి రంపచోడవరం 187 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉండటంతో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరో కీలక ప్రతిపాదన ఏంటంటే అమరావతిని కేంద్రంగా చేసుకొని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలను కలిపి రాజధాని చుట్టుపక్కల ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై చర్చ కొనసాగుతోంది. అమరావతి రాష్ట్ర రాజధానిగా మారుతున్న నేపథ్యంలో, అక్కడి శాంతిభద్రతలు, ప్రొటోకాల్ విధులు, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాగా ఏర్పాటు చేయడం సముచితమని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. అదేవిధంగా మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కూడా సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు.


అద్దంకి, మడకశిరతో సహా దాదాపు పది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒక నియోజకవర్గం రెండు లేదా మూడు డివిజన్లకు విభజించబడితే పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే పరిధిలోకి తీసుకురావాలన్న సూచన కూడా ఉంది. ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆగస్టు 13న సచివాలయంలో మొదటి సమావేశం జరిగి, జిల్లా కలెక్టర్లు ప్రజాసంఘాలు, నాయకుల నుంచి అందిన సుమారు 200 అర్జీలను పరిశీలించారు. మూడు రోజుల క్రితం జరిగిన సమీక్షలో ఈ అర్జీలపై చర్చించి తుది ప్రతిపాదనలు ఖరారు చేశారు. అయితే ఏ మార్పులు చేసినా వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకెళ్తోంది. పూర్తి వివరాలు బయటకు రాగానే రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: